భారత్-పాక్ సరిహద్దు 2018 వరుకు మూసేస్తాం: రాజ్ నాథ్ సింగ్
రాజస్థాన్: భారత్-పాకిస్థాన్ సరిహద్దు విషయంలో కేంద్ర హోం శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 2018 డిసెంబర్ వరకు భారత్-పాకిస్థాన్ సరిహద్దులను పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.
శుక్రవారం రాజస్థాన్ లోని జైసల్మేర్ లో భారత్ సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రాజ్ నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడారు.
భారతదేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడమని తేల్చి చెప్పారు. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపధ్యంలో మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. సైన్యం పట్ల పూర్తి విశ్వసనీయత చూపాలని ఆయన కోరారు.
2016-2018 మధ్య కాలంలో సరిహద్దులో పరిస్థితిని కనిపెట్టి చూస్తామని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. అంతే కాకుండా బోర్డర్ సెక్యూరిటీ గ్రిడ్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతామని రాజ్ నాథ్ సింగ్ వివరించారు.