India, Pakisstan Cricket Match: ధోని ఎత్తుకున్న పిల్లాడు ఎవరు? గంగూలీకి ముషారఫ్ ఎందుకు ఫోన్ చేశారు
పాకిస్తాన్ క్రికెట్ జట్టు 1999 జనవరిలో భారత్లో పర్యటించడానికి ముందు శివసేన పార్టీ ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. భారత్లో పాక్ జట్టును ఆడనివ్వబోమంటూ నిరసనలు చేసింది.
నిరసనల్లో భాగంగా ఒకరోజు రాత్రి దిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలోకి చొరబడిన శివసేన కార్యకర్తలు పిచ్ను ధ్వంసం చేశారు.
గత ఏడాది టి20 ప్రపంచకప్ సందర్భంగా షార్జాలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోయినప్పుడు కొంతమంది దాన్ని తట్టుకోలేకపోయారు. ద్వేషాన్ని వెదజల్లారు.
భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీని దేశద్రోహి అని పిలిచారు. కెప్టెన్ విరాట్ కోహ్లి 10 నెలల కూతుర్ని రేప్ చేస్తామంటూ బెదిరించారు. ఈ కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత్-పాక్ మ్యాచ్ల సందర్భంగా జరిగిన ఇలాంటి చేదు ఘటనలు ఇంకా ఉన్నాయి. అయితే, కేవలం వీటి ఆధారంగా ఈ రెండు దేశాల జట్ల మధ్య ద్వేషం ఉందని చెప్పడానికి వీల్లేదు.
భారత్-పాక్ మధ్య మరో అందమైన కోణం ఉంది. ఇందులో ప్రజలే కాకుండా ఇరు దేశాల క్రికెటర్లు కూడా ఒకరిపై ఒకరు గౌరవం, సానుకూల ఆలోచనలతో ఉంటారు.
- సర్ఫరాజ్ ఖాన్: ప్రాక్టీస్లో అతడి వికెట్ పడగొడితే పైసలిస్తానంటూ ప్రతి రోజూ పందెం కాసిన తండ్రి
- జస్ప్రీత్ బుమ్రా: టెస్టుల్లో ఒకే ఓవర్లో 35 పరుగులు చేసి ప్రపంచ రికార్డు, యువరాజ్ సింగ్తో పోలుస్తూ ఫ్యాన్స్ ట్వీట్లు
సచిన్ వీరాభిమాని ఇంజమామ్ కుమారుడు
2004లో పాకిస్తాన్లో భారత్ పర్యటించింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో పాక్ జట్టు ప్రాక్టీస్ చేసిన అనంతరం భారత జట్టు అక్కడికి ప్రాక్టీస్ కోసం చేరుకుంది. అప్పుడొక ఆసక్తికర ఘటన జరిగింది.
అప్పటి పాక్ జట్టు కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ తన కుమారుడితో కలిసి భారత్ ప్రాక్టీస్ చేస్తోన్న నెట్ వైపు వెళ్లడం అందరూ గమనించారు.
అక్కడే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తోన్న సచిన్ తెందూల్కర్ వద్దకు ఇంజమామ్ వెళ్లాడు. ''ఇతను నా కుమారుడు, కానీ మీకు మాత్రమే అభిమాని'' అంటూ తన కుమారున్ని సచిన్కు పరిచయం చేశాడు.
తన ఫేవరెట్ బ్యాట్స్మన్ సచిన్ తెందూల్కర్ను కలవాలని ఇబ్తిసామ్-ఉల్-హక్ అడగడంతో ఇంజమామ్ తన కుమారుని కోరికను నెరవేర్చాడు. సచిన్ను కలవడంతో ఇబ్తిసామ్ చాలా సంతోషపడ్డారు. సచిన్ కూడా ఇబ్తిసామ్తో చాలాసేపు మాట్లాడాడు.
- చంద్రకాంత్ పండిత్: దేశవాళీ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కోచ్ కథేంటో తెలుసుకోండి
- దినేశ్ కార్తీక్: ఫినిష్ అయిపోయాడనుకున్న ప్రతిసారీ ఫీనిక్స్ లాగా పైకి లేస్తున్న క్రికెటర్
గంగూలీకి పర్వేజ్ ముషారఫ్ ఎందుకు ఫోన్ చేశారు?
2004 పాక్ పర్యటనలో భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ. అయితే, ఈ సిరీస్ కంటే ముందు జరిగిన వన్డే సిరీస్ మ్యాచ్లో క్యాచ్ పడుతుండగా గంగూలీ గాయపడ్డారు. మూడు వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్ సూచించారు. అయితే, గంగూలీ ఆలోచనలు వేరేగా ఉన్నాయి. దీని గురించి 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఇనఫ్' అనే పుస్తకంలో గంగూలీ వివరించారు.
''లాహోర్లో మేం బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్లో ఏర్పాటు చేసిన గట్టి భద్రత కారణంగా నాకు అదొక కోటలా అనిపించింది. నా స్నేహితులు కొంతమంది మ్యాచ్ చూడటం కోసం కోల్కతా నుంచి వచ్చారు. గోల్మండిలోని స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. అక్కడికి వెళ్లి కబాబ్స్, తందూరి డిష్ తినాలని నా స్నేహితులు ప్లాన్ చేసినట్లు నాకు అర్ధరాత్రి తెలిసింది. అప్పుడు నేను అక్కడికి వెళ్లాలనుకున్నా. నా గాయం గురించి కూడా పట్టించుకోలేదు. సెక్యూరిటీ చాలా పటిష్టంగా ఉంది. కానీ నేను స్వేచ్ఛగా బయట తిరగాలి అనుకున్నా.
నా సెక్యూరిటీ ఆఫీసర్కు చెప్పకుండా కేవలం టీమ్ మేనేజర్ రత్నాకర్ శెట్టికి మా ప్లాన్ గురించి చెప్పాను. నా స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నట్లు సమాచారమిచ్చి వెనుక తలుపు నుంచి బయటకు వెళ్లాను. నా ముఖాన్ని క్యాప్తో కవర్ చేసుకున్నా.
స్ట్రీట్ ఫుడ్ బయట కూర్చొని తింటుండగా ఎవరో ఒకరు నా దగ్గరికి వచ్చి 'హేయ్, మీరు సౌరవ్ గంగూలీ కదా?' అని అడిగారు. లేదు, నేను కాదని చెప్పాను. అప్పుడు ఆయన 'కానీ, మీరు అచ్చం సౌరవ్ గంగూలీలాగే ఉన్నారు' అని చెప్పి వెళ్లిపోయారు. నేను, నా స్నేహితులు చాలా కష్టం మీద నవ్వు ఆపుకొన్నాం.
- మిథాలీ రాజ్: భారత మహిళా క్రికెట్ రూపురేఖలు మార్చేసిన క్రీడాకారిణి
- సచిన్ తెందుల్కర్ అంతు చూడాలనుకున్నాను: షోయబ్ అఖ్తర్
తర్వాత మరో వ్యక్తి వచ్చి '' హలో సర్, మీరు ఇక్కడున్నారా? మీ జట్టు గత మ్యాచ్లో ఎంతో గొప్పగా ఆడింది'' అని అన్నారు. నేను స్పందించకపోయేసరికి ఆయన కూడా వెళ్లిపోయారు.
మేం తినడం పూర్తి కావొస్తుండగా, భారత జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ నన్ను చూశారు. భారత సమాచార మంత్రి రవిశంకర్ ప్రసాద్తో డిన్నర్ కోసం ఆయన అక్కడికి వచ్చారు.
కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న నన్ను చూసిన ఆయన గట్టిగా గంగూలీ అని అరిచారు. వెంటనే అక్కడున్న వారందరూ నా చుట్టూ గుమిగూడారు.
షాప్ ఓనర్కు డబ్బు చెల్లించి వెంటనే వెళ్లిపోవడం ఉత్తమమని నేను భావించాను. కానీ, నేను డబ్బులివ్వగా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. తిరస్కరించారు. వెంటనే కారు దగ్గరికి వెళ్లిపోయాను. సర్దేశాయ్ నా పేరును పిలిచి ఉండకపోతే నేను వచ్చినట్లు ఎవరికీ తెలిసి ఉండకపోయేది కదా అని అనుకున్నా.
ఆ మరుసటి రోజు ఉదయం నా గదిలో ఫోన్ మోగింది. పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అని నాకు ఫోన్లో చెప్పారు. ఆయన నాతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారో నాకు ఎంతకూ అర్థం కాలేదు.
తర్వాత ఫోన్లో ఆయన నాతో చాలా మృదువుగా మాట్లాడారు. ''ఒకవేళ మీరు మళ్లీ బయటకు వెళ్లాలి అనుకుంటే దయచేసి సెక్యూరిటీకి చెప్పండి. మేం మీకు భద్రతను ఏర్పాటు చేస్తాం. దయచేసి ఇలా చెప్పకుండా వెళ్లొద్దు'' అని ఆయన నాతో అన్నారు.
అప్పుడు నాకు చాలా సిగ్గుగా అనిపించింది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, వసీమ్ అక్రమ్ అన్కట్టర్లను ఎదుర్కోవడం చాలా సులభం అని అనిపించింది'' అని గంగూలీ తన పుస్తకంలో వివరించారు.
- 'హర్భజన్ సింగ్తో జరిగిన ఆ ఒక్క గొడవ ఆండ్రూ సైమండ్స్ కెరీర్నే నాశనం చేసింది’
- రాహుల్ ద్రవిడ్: ప్రజల మధ్యలో కూర్చున్నా భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ను ఏ ఒక్కరూ గుర్తుపట్టనప్పుడు..
ఆతిథ్యానికి ధన్యవాదాలు
2004లో పాక్లో భారత జట్టు పర్యటించిన సమయంలో కార్గిల్ యుద్ధం కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ భారత్ అక్కడికి వెళ్లింది. అంతేకాకుండా ఈ పర్యటనను భారత్-పాక్ క్రికెట్ చరిత్రలో సంతోషకరమైన క్షణాలలో ఒకటిగా చెబుతుంటారు.
ఈ పర్యటన విజయవంతం కావడం వెనుక అప్పటి పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ప్రదర్శించిన క్రికెట్ దౌత్యం ప్రముఖ పాత్ర పోషించింది. దీని తర్వాత మొహమ్మద్ అలీ జిన్నా కూతురు దీనా వాడియా, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ పాకిస్తాన్లో పర్యటించారు.
వీరే కాకుండా వేలాది మంది భారత అభిమానులు మ్యాచ్లు చూడటం కోసం పాక్కు వెళ్లారు.
పాక్లోని భారత హై కమిషనర్ శివశంకర్ మేనన్ దీని గురించి షహర్యార్ ఖాన్తో మాట్లాడుతూ... '' షహర్యార్ సార్, మ్యాచ్ చూసేందుకు 20 వేల మంది భారతీయ అభిమానులు పాకిస్తాన్కు వచ్చారు. మీరు పాకిస్తాన్ రాయబారిలా వ్యవహరించి వారందరినీ తిరిగి భారత్కు పంపించారు. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు'' అని అన్నారు.
- రింకూ సింగ్: కోచింగ్ సెంటర్లో గదులు తుడిచే పని నుంచి ఐపీఎల్ క్రికెట్ స్టార్ దాకా...
- యుజ్వేంద్ర చాహల్ను 15వ అంతస్తు నుంచి వేలాడదీసిన ఆ క్రికెటర్ ఎవరు
ఒకరికొకరి సహాయం
1992 ప్రపంచకప్ తర్వాత షార్ట్ పిచ్ బంతుల్ని ఆడటంలో ఇంజమామ్-ఉల్-హక్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే, ఈ ఇబ్బందిని ఎదుర్కోవడంలో సునీల్ గావస్కర్ ఇచ్చిన సలహా సహాయపడిందని ఇంజమామ్ గుర్తు చేసుకుంటాడు.
అదే విధంగా భారత బ్యాట్స్మన్ అజహరుద్దీన్ తన బ్యాటింగ్ టెక్నిక్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో అతను సహాయం కోసం జహీర్ అబ్బాస్ను కలిశాడు. సౌరవ్ గంగూలీ బ్యాట్పై గ్రిప్, స్టాన్స్తో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా జహీర్ అబ్బార్ సహాయం చేశారు.
2016లో పాక్ జట్టు ఇంగ్లండ్లో పర్యటించింది. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తుండగా యూనిస్ ఖాన్ ఇబ్బంది పడుతున్నట్లుగా అజహరుద్దీన్ గుర్తించాడు. ఈ విషయాన్ని యూనిస్తో చెప్పారు.
అజహరుద్దీన్ సలహా మేరకు మార్పులు చేసుకున్న యూనిస్ ఖాన్ తొలి టెస్టులో డబుల్ సెంచరీ సాధించాడు.
- షేన్ వార్న్ స్పిన్ బౌలింగ్: 'నేను వార్న్కు కీపింగ్ చేయలేను’ అంటూ గ్లోవ్స్ విసిరికొట్టిన కీపర్.. ఒకే మ్యాచ్లో ముగ్గురు కీపర్లు
- షేన్ వార్న్: 'బాల్ ఆఫ్ ది సెంచరీ' కథ ఇదీ..
ఆత్మీయత చాటే చిత్రాలు
భారత్-పాకిస్తాన్ క్రికెట్లోని అందమైన గుర్తుల్ని కొన్ని చిత్రాల్లో చూడొచ్చు. రెండు దేశాల క్రికెటర్లు నవ్వుతూ కనిపించే ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తాయి.
2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే హోటల్లో బస చేశాయి.
ఫైనల్కు ఒకరోజు ముందు పాక్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ తన చిన్నారి తనయుడు అబ్దుల్లాతో కలిసి లాబీలో నడుస్తున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని, ఈ చిన్నారి ఎవరని అడిగాడు.
నా కుమారుడు అబ్దుల్లా అని సర్ఫరాజ్ చెప్పగా, వెంటనే ధోని ఆ బాబును తీసుకొని ఎత్తుకోగా.. ఆ ఫొటో ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది.
గత ఏడాది టీ20 ప్రపంచకప్లో ఓటమి తర్వాత తర్వాత పాకిస్తాన్ వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ను హత్తుకుంటూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చూసిన క్రీడా స్ఫూర్తిని కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు.
2016 టి20 ప్రపంచకప్ సందర్భంగా జరిగిన మరో ఘటనను కూడా క్రీడాభిమానులు తప్పకుండా గుర్తుంచుకుంటారు.
మ్యాచ్కు ముందు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో భారత్, పాక్ క్రికెటర్లు వార్మప్ చేస్తున్నారు. అప్పుడు పాకిస్తాన్ జట్టు ప్రాక్టీస్ చేస్తోన్న ప్రదేశానికి వెళ్లిన భారత కెప్టెన్ కోహ్లి, పాక్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమీర్కు తన బ్యాట్ను గిఫ్ట్గా ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి:
- బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో దోషుల విడుదలపై బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోంది?
- లైగర్ రివ్యూ: బాక్సాఫీసు బరిలో ’బాక్సర్’ గెలిచాడా? లేదా?
- మహిళల గురించి మనుస్మృతి ఏం చెబుతోంది... 2,000 ఏళ్ల నాటి ఈ హిందూ నియమావళిని నేటి భారత మహిళలు పాటించాలా?
- నరేంద్ర మోదీని నేరుగా ఢీకొట్టేందుకు రాహుల్ గాంధీ ఎందుకు సిద్ధపడటం లేదు?
- ముఖ్యమంత్రి జగన్ పర్యటన సమయంలో ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నాయకులను ఎందుకు నిర్బంధిస్తున్నారు? ఇది చట్టబద్ధమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)