భారత్-పాక్ భాయి భాయి -2ఏళ్ల తర్వాత నేడు ఫేస్ టు ఫేస్ చర్చలు -సింధు జల వివాదాల పరిష్కారం దిశగా
రెండేళ్ల కిందటి పుల్వామా ఉగ్రదాడి, అనంతర పరిణామాలతో అన్ని రకాల తెగదెంపులు చేసుకుని, పూర్తిగా దూరమైపోయిన భారత్, పాకిస్తాన్ లు తిరిగి శాంతి బాట పట్టాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వంలో దాయాదులిద్దరూ రహస్య శాంతి ప్రణాళిక అమలుకు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే సరిహద్దులో కాల్పుల విరమణపై రెండు దేశాల సైన్యాలు ఉమ్మడిగా ఒక ప్రకటన చేయగా, ఇప్పుడు జల వివాదాల పరిష్కారం దిశగా రెండు దేశాలూ అడుగులు వేస్తున్నాయి..
భారత్-పాక్ రహస్య శాంతి ప్రణాళిక -యూఏఈ మధ్యవర్తిత్వం -ఇమ్రాన్కు మోదీ విషెస్ - త్వరలో సంచలనాలు
సింధూ నదీజలాల పంపిణీ, వినియోగాలపై నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేలా భారత్, పాకిస్తాన్ చర్చలను పున:ప్రారంభించాయి. రెండేళ్ల తర్వాత తొలిసారిగా ఫేస్ టు ఫేస్ భేటీ కానున్నాయి. సింధూ జలాలపై ఏటా ఒక్కసారైనా సమావేశమయ్యే రెండు దేశాలూ.. 2019 తర్వాత ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిచాయి. రెండేళ్ల తర్వాత మొత్తానికి చర్చల ప్రక్రియ పున: ప్రారంభమైంది. మంగళవారం, బుధవారాల్లో రెండు దేశాల అధికారులు అంశాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
సింధు నదిపై వివాదాల విషయంలో తమ వాదనలు వినిపించేందుకు ఇప్పటికే రెండు దేశాల అధికారులు సిద్ధమయ్యారు. భారత గడ్డపై జరుగుతోన్న ఈ సమావేశాల కోసం పాక్ ప్రతినిధుల బృందం ఇవాళ రానుంది. సింధూ జలాల పంపిణీ విషయంలో భారత్ కమిషనర్ గా ఉన్న పీకే సక్సేనా.. భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించనున్నారు. కేంద్ర జల సంఘం, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ, జాతీయ జలవిద్యుత్ కార్పొరేషన్ లకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు. పాకిస్థాన్ తరఫున సయ్యద్ మహ్మద్ మెహెర్ అలీ షా.. వారి ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించనున్నారు.
లడఖ్ లో సింధూ నదిపై భారత్ పలు జల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. వాటిపై పాక్ ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మార్చి 23, 24న ఢిల్లీలో సింధూ నదీ నీటి పంపకాలపై శాశ్వత సింధు కమిషన్ 116వ సమావేశం జరుగుతుందని ఇటీవల పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి జహీద్ హఫీజ్ ఛౌదరి ప్రకటించారు. భారత్ కడుతున్న పాకాల్ దూల్, లోయర్ కల్నాయి జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్లు పాక్ కు నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని అన్నారు.