కరోనా ఉప్పెన: అదే తీవ్రత..అవే మరణాలు: మళ్లీ నాలుగు లక్షలకు: అదొక్కటే బిగ్ రిలీఫ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో ఏ మాత్రం మార్పు ఉండట్లేదు. రోజువారీ కేసుల్లో అదే జోరు, హోరు నెలకొంది. కనీవినీ ఎరుగని రీతిలో కరోనా కేసుల సంఖ్య పరుగులు పెడుతోంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. ఒక్కరోజు దాటేటప్పటికీ వేల సంఖ్యలో జత అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక.. ఇలా ఏ ఒక్క రాష్ట్రం కూడా మినహాయింపు లేదు. కరోనా మరణాల్లోనూ ఆందోళనను కలిగించే సంఖ్య కనిపిస్తోంది. ఈ పరిణామాల్లోనూ దేశవ్యాప్తంగా రికవరీ రేటు భారీగా ఉండటం ఊరట కలిగిస్తోంది. రికార్డు స్థాయిలో డిశ్చార్జీలు నమోదయ్యాయి.
Recommended Video
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,92,488 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,689 మంది మరణించారు. 3,07,865 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,95,57,457కు చేరింది. ఇందులో 1,59,92,271 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2,15,542 వేలుగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 33,49,644కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో మూడు లక్షలకు పైగా పేషెంట్లు కోలుకోవడం రికార్డు. ఈ స్థాయిలో రికవరీలు ఇదివరకెప్పుడూ నమోదు కాలేదు. కరోనా కల్లోలం రేపుతోన్న ఈ పరిస్థితుల్లో మూడు లక్షలకు పైగా రికవరీ సంఖ్య ఉండటం ఊరట కలిగిస్తోంది.

అదే సమయంలో యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోవడం మరింత ఆందోళనకు దారి తీస్తోంది. ఇన్ని లక్షల మంది ఒకేసారి వైద్యాన్ని కల్పించలేకపోతున్నాయి ఆయా రాష్ట్రాలు. ఆసుపత్రులు, క్లినిక్లు కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆక్సిజన్ నిల్వల కొరత ఏర్పడింది. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పేషెంట్లు కన్నుమూస్తున్నారు. ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడానికి పారిశ్రామిక దిగ్గజాలు రంగంలోకి దిగాయి. వందలాది మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. అనేక దేశాలు ఆక్సిజన్ జనరేటర్లు, ఐసీయూ పరికరాలు, వెంటిలేటర్లు భారత్కు సరఫరా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 15,68,16,031 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వెల్లడించింది.












Click it and Unblock the Notifications