భారత్ లో పాకిస్థానీ పౌరులకు కేంద్రం భారీ ఊరట..! కీలక ఉత్తర్వులు..
భారతదేశంలో సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్న పాకిస్తానీ జాతీయులకు కేంద్రం ఇవాళ భారీ ఊరటనిచ్చింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వెంటనే దేశం విడిచి వెళ్లాలంటూ వారికి ఇచ్చిన ఆదేశాలను సవరించింది. దేశంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భారత్ లో వేల సంఖ్యలో ఉన్న పాకిస్తాన్ పౌరులకు ఊరట దక్కినట్లయింది.
పహల్గాం దాడి తర్వాత భారత్ లో పాకిస్తాన్ పౌరుల్ని వెంటనే దేశం విడిచి వెళ్లేలా ఆదేశాలు జారీ చేసిన కేంద్రం వారి వీసాల్ని సైతం రద్దు చేసింది. అయితే వివిధ కారణాలతో మెడికల్ వీసాలు, ఇతర వీసాలపై దేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరులు దీంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఈ మేరకు వారికి స్వల్ప గడువు ఇచ్చి వెనక్కి పంపాలనే విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో కేంద్రం తమ నిర్ణయాన్ని సవరించినట్లు తెలుస్తోంది.

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వాఘా-అట్టారి సరిహద్దు ద్వారా తిరిగి వారి స్వదేశానికి వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది. హోం మంత్రిత్వ శాఖ చేసిన ఈ ఉత్తర్వు ఏప్రిల్ 30న సరిహద్దును మూసివేస్తామని గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించింది. దీంతో ఇవాళ్టి నుంచి భారత్ లో పాకిస్తాన్ జాతీయులు స్వచ్చందంగా తమ దేశానికి ఈ సరిహద్దు గుండా తిరిగి వెళ్లిపోయేందుకు అవకాశం కల్పించింది.
గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించిన కేంద్రం.. ఇందులో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పాకిస్తాన్ జాతీయులు అట్టారిలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నుండి భారతదేశం నుండి పాకిస్తాన్లోకి వెళ్లడానికి అనుమతించబడవచ్చని తెలిపింది. అలాగే తగిన అనుమతితో వీరిని అనుమతించవచ్చని చెక్ పోస్టుల్లో భద్రతా సిబ్బందికి ఆదేశాలు పంపింది. దీంతో ఎమర్జెన్సీ కారణాలతో భారత్ లో ఉండిపోయిన వారికి ఊరట లభిస్తుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications