కరోనా విప్పోటనం - లాక్ డౌనే మార్గమా : 2.47 లక్షల కేసుల నమోదు - 8 నెలల తరువాత గరిష్టంగా..!!
భారత్ లో కరోనా విప్పోటనం కొనసాగుతోంది. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి మొదలైన కేసుల పెరుగుదల రోజు రోజుకీ పెరిగిపోతోంది. మధ్యలో రెండు రోజులు స్వల్ప తగ్గుదల కనిపించినా.. తిరిగి ఇప్పుడు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,47,417 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 84,825 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
8 నెలల కాలంలో రికార్డు స్థాయిలో
24 గంటల్లో గత రోజు కంటే 50 వేల కేసులు పెరిగాయి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో తొలి సారిగా భారత్ రెండు లక్షల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దాటింది. రాజస్థాన్ లో ఒకే రోజు 10 వేలకు పైగా కరోనా కేసులను గుర్తించారు. ప్రయాగ్ రాజ్ లో 38 మందిని కరోనా పాజిటివ్ బాధితులుగా నిర్దారణ అయింది.
దీని ద్వారా దేశంలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 11,17,531 కాగా, పాజిటివిటీ రేటు 13.11 శాతానికి చేరింది. జనవరి నెలాఖరుకు కోవిడ్ కేసుల సంఖ్య పీక్ కు చేరే అవకాశం ఉందని నిపుణులు ంచనా వేస్తున్నారు. ఓమిక్రాన్ పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది. ఫ్లూ ను సాధారణంగా తీసుకోవద్దంటూ హెచ్చరించింది.
పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులు
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 5,488 కు చేరింది. కాగా, ఇప్పటికే 2,162 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత ఏడాది మే 26న భారత్ లో 2,11,298 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఇప్పుడు తిరిగి రెండు లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,45,916 మందికి కరోనా సోకింది. 8,032 మంది ప్రాణాలు కోల్పోయాు. దీంతో మొత్తం కేసులు 31,75,55,259కి చేరగా.. మరణాలు 55,30,352కు పెరిగింది.
అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,14,494 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. 2,269 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.43 కోట్లు దాటింది.ఫ్రాన్స్లో బుధవారం ఒక్కరోజే 3,61,719 కేసులు వెలుగుచూశాయి. మరో 246 మంది చనిపోయారు.బ్రిటన్లో మరో 1,29,587 మంది వైరస్ బారిన పడ్డారు. 398 మంది మృతి చెందారు.
నేటి ప్రధాని సమీక్షలో కీలక నిర్ణయాలు
ఇక, దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చ్యువల్ సమావేశం కానున్నారు. రాష్ట్రాల వారీగా కరోనా కేసులు.. స్థితి గతుల పైన ఆరా తీయనున్నారు. రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్న నియంత్రణ.. చికత్స చర్యల పైన వాకబు చేస్తారు. అదే సమయంలో కేంద్రం నుంచి అందాల్సిన సాయం.. నియంత్రణకు అమలు చేయాల్సిన ఆంక్షల పైన ముఖ్యమంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు.
అయితే, రాష్ట్ర స్థాయిలోనే ఆంక్షల నిర్ణయాల అమలు దిశగా చర్యలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే, కేసులు పెరుగుతున్నా.. మరణాల సంఖ్య తక్కువగా ఉండటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తూ లాక్ డౌన్ తిరిగి మార్గంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో..ఈ రోజు ప్రధాని నిర్వహించే సమావేశం కీలకంగా మారుతోంది.