తగ్గుతోన్న కరోనా తీవ్రత..అయినా: మరణాల్లో అదే ఉధృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య రెండు లక్షలకు పైగా తగ్గింది. కొద్దిరోజులుగా వరుసగా రెండు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. మరణాల్లో మాత్రం ఏ మాత్రం తీవ్రత తగ్గట్లేదు. ఎప్పట్లాగే మూడున్నర వేల వరకు మరణాలు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,65,553 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,460 మంది మరణించారు. డిశ్చార్జీలు కూడా ఓ మోస్తరుగా తగ్గాయి. కొత్తగా ఒక్కరోజులో 2,76,309 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదివరకు ఈ సంఖ్య మూడున్నర లక్షలకు పైగా ఉండేది. రోజువారీ పాజిటివ్ కేసులతో పోల్చుకుంటే- డిశ్చార్జీల్లో రెట్టింపు కొనసాగుతోంది. ఫలితంగా- యాక్టివ్ కేసలు భారీగా తగ్గాయి. 20 లక్షలకు పడిపోయాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,78,94,800కు చేరింది. ఇందులో 2,54,54,320 మంది కోలుకున్నారు. 3,25,972 మంది మృత్యువాత పడ్డారు. యాక్టివ్ కేసుల సంఖ్య 21,14,508గా రికార్డయింది. గరిష్ఠంగా 38 లక్షలకు చేరువగా వెళ్లిన యాక్టివ్ కేసులు కొద్దిరోజులుగా వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 21,20,66,614 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది.
Recommended Video
ఇదివరకు 30 వేల వరకు రోజువారీ కేసులు నమోదైన ఢిల్లీలో వాటి సంఖ్య వెయ్యికి పడిపోయిన విషయం తెలిసిందే. వేల సంఖ్యలో రోజుారీ కరోనా కేసులు నమోదవుతూ వచ్చిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో కొత్త కేసుల సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది. నెల రోజులకు పైగా లాక్డౌన్లోకి వెళ్లిన ఢిల్లీ.. సత్ఫలితాలను సాధించింది. ఢిల్లీలో నమోదైన కొత్త కేసులు వెయ్యి వరకే కావడం లాక్డౌన్ విజయవంతం కావడాన్ని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications