దేశంలో 35వేల లోపే కరోనా కేసులు, తగ్గిన మరణాలు: కేరళలో కొనసాగుతున్న ఉధృతి
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అంతకుముందు రోజు 40వేలు దాటిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా తగ్గింది. అయితే, దేశంలో కొత్తగా నమోదైన కొత్త కేసుల్లో సగానికిపైగా కేసులు ఒక్క కేరళ నుంచే ఉండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
దేశంలో కొత్తగా 34,973 కరోనా కేసులు
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 17.87 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 34,973 మందికి కరోనా సోకినట్లు తేలింది. అంతకుముందు రోజు(43,263)తో పోలిస్తే దాదాపు 8వేల కేసులు తక్కువగా ఉన్నాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. మరణాలు కూడా మరోసారి 300 దిగువన నమోదయ్యాయి. గురువారంనాడు 260 మంది కరోనాతో బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,42,009కు చేరింది.
పెరిగిన రికవరీ.. 4 లక్షల దిగువనే యాక్టివ్ కేసులు
గత 24 గంటల వ్యవధిలో 37,681 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.23 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 97.49 శాతంగా ఉంది. కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,90,646 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 1.18 శాతంగా ఉంది. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. గురువారం 67,58 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. దీంతో ఇప్పటి వరకు 72.37 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కేరళలోనే అత్యధిక కేసులు.. నిఫా కలకలం
కాగా, కేరళ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న కేసులు, మరణాల్లో 60 శాతానికి పైగా కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. గురువారం కేరళలో 26,200 కరోనా కేసులు నమోదు కాగా.. 125 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 22,126కు పెరిగింది. పాజిటివిటీ రేటు 16.69 శాతంగా ఉంది. కేరళ రాష్ట్రంలోని నగరాల్లోనూ కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంటోంది. త్రిస్సూర్లో 3279, ఎర్నాకుళంలో 3175, తిరువనంతపురంలో 2598, మలప్పురంలో 2452, కోజికోడ్లో 2332, కోల్లాంలో 2124, పాలక్కడ్లో 1996, అలప్పుజలో 1604, కొట్టాయంలో 1580, కన్నూరులో 1532, పథనంథిట్టలో 1244, వాయనాడ్లో 981, ఇడుక్కిలో 848, కసర్గడ్లో 455 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కేరళను నిఫా వైరస్ వణికిస్తోంది. కోజికోడ్లో 12ఏళ్ల బాలుడు నిఫాతో మరణించిన విషయం తెలిసిందే. కేంద్రం కూడా ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. కాగా, నిపా వైరస్కు వైద్యం లేదు. ఇప్పటి వరకు అనుమతి పొందిన ఏ ఔషధం అందుబాటులోకి రాలేదు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. అయితే, ఇది వేగంగా వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. మొత్తం కేరళలో ఇప్పటివరకు సుమారు 150 మందికిపైగా నిఫా వైరస్ బారినపడినట్లు సమాచారం.