బెంగళూరులో కరోనా పేషెంట్లు లేరట: దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ క్లోజ్: లక్షన్నరకు
బెంగళూరు: ఉద్యాననగరి బెంగళూరులో ఏర్పాటు చేసిన అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ మూత పడబోతోంది. ఈ నెల 15వ తేద నుంచి దీన్ని మూసివేయబోతున్నారు అధికారులు. ఈ మేరకు ఇప్పటికే ఓ సర్కులర్ను జారీ చేశారు. ఎందుకు మూసివేస్తున్నారనడానికి సరైన కారణాలను అధికారులు వెల్లడించట్లేదు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన పడకలకు అనుగుణంగా పేషెంట్ల సంఖ్య లేకపోవడం ఓ కారణమని చెబుతున్నారు. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోన్న బెంగళూరులో పేషెంట్ల కొరత కారణం కాదనే వాదనా వినిపిస్తోంది.
జగన్ సర్కార్కు ఏపీ హైకోర్టు నుంచి మరో స్టే: ఇక వారిపై సీఐడీ దర్యాప్తునకు బ్రేక్
బెంగళూరులో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు లక్షన్నరకు చేరుకున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) అధికారులు ఆదివారం నాడు విడుదల చేసి బులెటిన్ ప్రకారం.. 1,47,581 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 1,05,692 మంది కోలుకున్నారు. 2164 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో 2824 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 38 మంది మృత్యువాత పడ్డారు. రోజూ ఒక్క బెంగళూరు పరిధిలోనే 2000 నుంచి 3000 వరకు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అతి పెద్ద కోవిడ్ కేర్ సెంటర్ను మూసివేయబోతుండటం చర్చనీయాంశమౌతోంది.
కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందించడానికి కర్ణాటక ప్రభుత్వం.. బెంగళూరులోని అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ కోవిడ్ కేర్ యూనిట్ను నెలకొల్పింది. 10 వేల పడకలతో దీన్ని ఏర్పాటు చేసింది. బాగల్కోటెలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం, కర్ణాటక వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మైనారిటీ హాస్టళ్లు, గాంధీ కృషి విజ్ఙాన కేంద్ర (జీకేవీకే) నుంచి ఫర్నిచర్ను తెప్పించింది. దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దింది. ఒకేసారి 10 వేల మంది కరోనా వైరస్ పేషెంట్లు ఇందులో చికిత్స తీసుకునే వెసలుబాటు కల్పించింది. దీని నిర్వహణ బాధ్యతను బీబీఎంపీకి అప్పగించింది.
తాజాగాఈ కోవిడ్ కేర్ సెంటర్ను మూసివేయాలని నిర్ణయించడం వివాదాస్పదమౌతోంది. రోజూ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని మూసివేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూరకంగా దీన్ని క్లోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) నేతలు విమర్శిస్తున్నారు. ఎలాంటి వైద్య సదుపాయాలను కల్పించకుండా ప్రభుత్వం కరోనా పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడుతున్నారు.