ఆమె బూట్లలో ఏదో పెట్టుకొచ్చింది.. అందుకే అలా చేశాం, అన్నీ నిరాధార ఆరోపణలే: పాక్
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: గూఢచర్యం కేసులో మరణశిక్ష పడి పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్ను చూసేందుకు ఆయన తల్లి, భార్య వెళ్లిన వ్యవహారంలో భారత్ చేసిన ఆరోపణలను పాకిస్తాన్ మంగళవారం తోసిపుచ్చింది.
భారత్వి నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేసింది. ఇలాంటి 'అర్థరహిత మాటల యుద్ధం'లో తలదూర్చాలని పాకిస్తాన్ భావించడం లేదని, కులభూషణ్ జాదవ్ను ఆయన తల్లి, భార్య కలిసిన వ్యవహారం చాలా పారదర్శకంగా జరిగిందని పేర్కొంది,
అంతేకాదు, కులభూషణ్ జాదవ్ ముమ్మాటికీ భారత్ గూఢచారి అని మరోసారి పాక్ ఉధ్ఘాటించింది. కులభూషణ్ జాదవ్ను కలిసేందుకు పాకిస్తాన్ వచ్చిన ఆయన తల్లి, భార్యకు ఎలాంటి అవమానం జరగలేదని కూడా స్పష్టం చేసింది.
జైలులో ఉన్న కలభూషణ్ జాదవ్ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతనల పట్ల పాకిస్తాన్ అధికారులు ప్రవర్తించిన విధానాన్ని భారత్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్లో కులభూషణ్ జాదవ్ను కలిసి తిరిగి భారత్ చేరిన వెంటనే ఆయన తల్లి, భార్య విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిశారు. అక్కడ ఏం జరిగిందో, పాక్ అధికారులు వారిపట్ల ఎలా ప్రవర్తించారో వివరించారు.
ఆ తరువాత భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పాక్ దుర్నీతిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కులభూషణ్ జాదవ్ శరీరంపై తీవ్ర గాయాలున్నాయంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళన వెలిబుచ్చారు.
అయితే భారత్ విమర్శలను, ఆందోళనను పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముహమ్మద్ ఫైసల్ కొట్టిపారేశారు. కులభూషణ్ భార్య తన బూట్లలో ఏదో పెట్టుకొచ్చిందని, అందుకే భద్రతా కారణాల రీత్యా తాము వాటిని స్వాధీనపరుచుకున్నామని చెప్పారు.
కులభూషణ్ తల్లి, భార్య నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాలు తిరిగి ఇచ్చేశామని, వారు వేసుకునేందుకు మరో బూట్ల జత కూడా ఇచ్చామని పేర్కొన్నారు. వారిపట్ల పాకిస్తాన్ అధికారులు చాలా సహృదయత చూపారని, ఇందుకు కులభూషణ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ 'పాకిస్తాన్కు కృతజ్ఞతలు' చెప్పడమే సాక్ష్యమని ఫైసల్ వివరించారు.