దేశంలో మూడున్నర లక్షలను దాటేసిన కరోనా మరణాలు: 63 రోజుల తరువాత..ఆందోళనకరమే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి భారీగా తగ్గింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య పెద్ద ఎత్తున పడిపోయింది. తాజాగా- లక్షకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. 63 రోజుల తరువాత లక్షకు దిగువగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే పరిస్థితి ఇంకొన్ని రోజులు కొనసాగే అవకాశాలు లేకపోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు అంచనా వేస్తోన్నారు. మరణాల్లో మాత్రం తీవ్రత తగ్గట్లేదు. రెండువేలకు పైగా మరణాలు రికార్డయ్యాయి. ఇదివరకటితో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే. అయినప్పటికీ- రెండువేలకు పైగా కరోనా డెత్స్ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 86,498 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,123 మంది మరణించారు. దీనికి అనుగుణంగా డిశ్చార్జీలు నమోదయ్యాయి. కొత్తగా ఒక్కరోజులో 1,82,282 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసులు కూడా భారీగా తగ్గాయి. 13 లక్షలకు పడిపోయాయి. యాక్టివ్ కేసులు ఇంత తక్కువ స్థాయిలో నమోదు కావడం సుదీర్ఘకాలం తరువాత ఇదే తొలిసారి. ఇదే వేగం కొనసాగితే- ఒకట్రెండు రోజుల్లో 10 లక్షలకు దిగువగా చేరొచ్చని అధికారులు అంచనా వేస్తోన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,96,4730కు చేరింది. ఇందులో 2,73,41,462 మంది కోలుకున్నారు. 3,51,309 మంది మృత్యువాత పడ్డారు. ఎవరూ కోరుకోని రికార్డ్ ఇది. దేశంలో మూడున్నర లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదవుతాయని ఎవరూ ఊహించి ఉండరు. ఆక్సిజన్, ఆసుపత్రుల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత వల్ల వందలాది మంది కరోనా పేషెంట్లు తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
భారత్ కంటే ముందు అగ్రరాజ్యం అమెరికా, బ్రెజిల్లో కరోనా మరణాలు అధికంగా ఉన్నాయి. అమెరికా-6,12,701, బ్రెజిల్-4,74,614 మంది మరణించారు. ఆ తరువాతి స్థానం భారత్దే. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,03,702గా రికార్డయింది. గరిష్ఠంగా ఈ సంఖ్య 38 లక్షలకు చేరువగా వెళ్లిన విషయం తెలిసిందే. రోజువారీ కరోనా కేసులు తగ్గుతూ రావడం, అదే సమయంలో డిశ్చార్జీలు రెట్టింపు నమోదవుతోన్న ప్రభావం యాక్టివ్ కేసులపై పడింది. ఫలితంగా అవి తగ్గుముఖం పడుతున్నాయి. మరోవంక వ్యాక్సినేషన్ కార్యక్రమంగా జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 23,61,98,726 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్లో పేర్కొంది.












Click it and Unblock the Notifications