భారత తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కన్నుమూత
ముంబై: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం తొలిసారి మహిళా ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వర్తించిన అన్నా రాజమ్ మల్హోత్రా(91) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం ఆమె తుది శ్వాస విడిచారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 1927, జులైలో అన్నా రాజమ్ జన్మించారు. కోజికోడ్లో ప్రాథమిక విద్యను, ఆ తర్వాత మద్రాసులో ఉన్నత విద్యను అభ్యసించారు. 1951లో ఆమె సివిల్ సర్వీస్లో చేరి మద్రాస్లో విధులు నిర్వహించారు.
అప్పటి సీఎం సీ రాజగోపాలచారి ప్రభుత్వంలో రాజమ్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 1985-1990 వరకు ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన ఆర్ఎన్ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకున్నారు.
మొదటిసారి హోసూరు సబ్ కలెక్టర్గా చేశారు. ఏడుగురు సీఎంల వద్ద ఆమె అధికారిగా చేశారు. 1982 ఢిల్లీలో జరిగిన ఏషియన్ గేమ్స్ ప్రాజెక్టుకు ఇంఛార్జీగా వ్యవహరించారు. గుర్రపు స్వారీ, షూటింగ్లోనూ ఆమె శిక్షణ పొందారు. అన్నా రాజమ్ మృతిపట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.