Vaccination: డిసెంబర్ నాటికి అందరికీ..మోడీ సర్కార్ మాటలేనా? ఎదురయ్యే సవాళ్లేంటీ?
న్యూఢిల్లీ: దేశంలో మహోత్పాతానికి కారణమైన కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్టీఏ ప్రభుత్వం.. సరికొత్త ప్రక్రియను ఆరంభించనుంది. ఇప్పటిదాకా డీసెంట్రలైజ్డ్గా ఉన్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. దాన్ని కేంద్రీకృతం చేసింది. వ్యాక్సినేషన్ బాధ్యతలన్నింటినీ రాష్ట్రాల నుంచి తప్పించింది. తానే స్వీకరించింది. డిసెంబర్ నాటికి మెజారిటీ జనాభాకు వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి అవసరమైన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
Recommended Video

లభ్యత.. స్థోమత..
అంతా బాగానే ఉన్నప్పటికీ.. కేంద్రం తన లక్ష్యాన్ని చేరుకోగలదా? అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. చాలినన్ని టీకాల స్టాక్ లేకుండానే.. కనీసం వాటికి ఆర్డర్ ఇవ్వకుండానే మూడోదశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రకటించినట్టే ఇది కూడా విఫలమౌతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యాన్ని అందుకునే విషయంలో కేంద్రానికి అనేక సవాళ్లు ఎదురవుతోన్నాయి. ఇందులో- టీకాల లభ్యత, వాటిని సకాలంలో కొనగలిగే స్థోమత, గ్రామ స్థాయికి చేరవేయగల సౌకర్యాలు ఉన్నాయా అనేది ప్రధానంగా మారింది.

159 కోట్ల డోసులు..
అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ ఏడునెలల కాలంలో కనీసం 159 కోట్ల డోసుల టీకాలను ఇప్పటి నుంచే సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు శాతం వేస్టీజీని పరిగణనలోకి తీసుకుంటే 164 కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరమౌతుంది. జనవరి 16వ తేదీన టీకాలను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. మే నాటికి సగటున అయిదు కోట్ల మందికి వ్యాక్సిన్లను ఇస్తూ వచ్చింది. డిసెంబర్ నాటికి అందరికీ టీకాలను ఇవ్వాలనే లక్ష్యాన్ని అందుకోవాలంటే.. ఈ సంఖ్య ఏ మాత్రం సరిపోదు. దీన్ని నాలుగింతలు చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా కనీసం 23 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే గానీ టార్గెట్ను ఛేదించలేదు.

రెండో డోసు కోసం సుదీర్ఘ వ్యవధి..
136 కోట్లమందికి పైగా ఉన్న దేశ జనాభాలో 12 శాతం మందికే వ్యాక్సిన్ అందింది. అందులోనూ రెండు డోసులు తీసుకున్న వారు మూడుశాతం మాత్రమే ఉన్నారు. ఎటొచ్చీ- రెండో డోసు వ్యాక్సిన్లను కేంద్రం సకాలంలో సరఫరా చేయలేకపోతోందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రారంభంలో డోసుకు డోసుకు మధ్య ఉన్న వ్యవధిని ఎకాఎకిన 28 నుంచి 84 రోజులకు పెంచాల్సి వచ్చింది. వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తోన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ఉత్పాదక సామర్థ్యం ఆశించిన స్థాయిలో పెరగట్లేదనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ అందుబాటులో ఉన్నప్పటికీ.. దాన్ని ఇంకా వినియోగించట్లేదు.

అదనపు ఆర్థిక భారం..
ఈ పరిణామాల మధ్య డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన ఇవ్వాలనే లక్ష్యాన్ని కేంద్రం అందుకోగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనీ అంటోన్నారు నిపుణులు. మరోవంక- వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రం మొత్తం తన చేతుల్లోకి తీసుకోవడం వల్ల అదనపు ఆర్థికభారం పడుతుందని, ఇది కూడా ఓ సవాల్గా మారొచ్చనీ చెబుతున్నారు. ఇప్పటికే లాక్డౌన్ తరహా పరిస్థితుల వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఈ పరిస్థితుల్లో అదనపు భారాన్ని మోసే స్థోమతను కేంద్రం తీసుకోవడం సాహసోపేతమైన నిర్ణయంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications