దేశంలో 3 లక్షల లోపు కరోనా కొత్త కేసులు, 4వేల లోపే మరణాలు: యాక్టివ్ కేసుల్లో తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 3 లక్షల కంటే తక్కువగానే కేసులు నమోదయ్యాయి. అంతేగాక, నిన్నమొన్నటి వరకు 4 వేలకుపైగా నమోదైన మరణాలు కాస్త తగ్గాయి. గత 24 గంటల్లో దేశంలో 20,55,010 నమూనాలను పరీక్షించగా.. 2,76,110 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించింది.

దేశంలో కొత్తగా 2,76,110 కరోనా కేసులు, 3874 మరణాలు
తాజాగా నమోదైన 2,76,110 కరోనా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,57,72,440కి చేరింది. ఇక గత 24 గంటల్లో 3874 మంది కరోనా బారినపడి మరణించారు. దీంతో ఇప్పటి వరకు మహమ్మారితో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,87,122కు చేరింది. కాగా, అంతకుముందు రోజు అత్యధికంగా 4529 మరణాలు నమోదు కావడం గమనార్హం.

దేశంలో 31,29,878కి తగ్గిన యాక్టివ్ కేసులు
భారీ సంఖ్యలో కరోనా నుంచి కోలుకుంటుండటంతో యాక్టివ్ కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 3.69 లక్షల మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 2.23 కోట్లకు చేరుకుంది. రికవరీ రేటు 86.23 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 31,29,878 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. క్రియాశీల రేటు 12.66 శాతానికి చేరింది.

నెమ్మదించిన కరోనా వ్యాక్సినేషన్.. ఏడాది చివరి నాటికి 267 కోట్ల డోసులు
మరోవైపు, దేశంలో టీకా కార్యక్రమం అనుకున్నంత వేగంగా జరగడం లేదు. నిన్న 11,66,090 మందికి మాత్రమే కరోనా వ్యాక్సిన్లు అందాయి. ఇప్పటి వరకు 18,70,09,792 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు వేయడం జరిగింది. అయితే, ఈ ఏడాది చివరి నాటికి భారత్లో 267 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దీంతో దేశంలో అత్యధిక మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. జులై వరకు 51 కోట్ల కరోనా డోసులు అందుబాటులోకి వస్తాయని, ఆగస్టు-డిసెంబర్ మధ్యలో మరో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు సేకరిస్తామని ఆయన తెలిపారు.

ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యత
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లందరికీ మొదటి ప్రాధాన్యతగా రెండు డోసులు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కరోనా టెస్టులు పెంచాలని సూచించారు. కరోనా మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా బారిన పడిన వ్యక్తులు.. కోలుకున్న తర్వాత మూడు నెలలకు రెండో డోసు తీసుకోవాలని సూచించారు. మహిళలందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications