2024 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు ఎదగాలి: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: 2024 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను మూడు ట్రిలియన్ అమెరికన్ డాలర్లుగా తీర్చిదిద్దేందుకు అంతా కృషి చేయాలని ప్రధాని మోడీ అన్నారు. ఐదవ నీతి ఆయోగ్ సమావేశం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇది సవాలుతో కూడినదే అయినప్పటికీ సాధించడం కష్టం కాదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాలు సహకారం అందిస్తే దీన్ని సుసాధ్యం చేసుకోవచ్చని మోడీ అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి రాష్ట్రాల్లో ఉన్న వనరులను గుర్తించి వాటిపై దృష్టి సారించి జిల్లా స్థాయినుంచి వృద్ధిని నమోదు చేస్తే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని మోడీ పిలుపునిచ్చారు.

సబ్కా సాత్, సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కల సాకారం కావాలి
బీజేపీ నినాదమైన సబ్కా సాత్, సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ కల సాకారం కావాలంటే నీతి ఆయోగ్ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో చాలా వరకు కరువు నెలకొందని చెప్పిన మోడీ.... కరువును ఎదుర్కొని జయిద్దామని పిలుపునిచ్చారు. ఇందుకోసం పర్ డ్రాప్..మోర్ క్రాప్ నినాదంతో ముందుకెళుదామని అన్నారు. ఇక కొత్తగా ఏర్పాటు అయిన జలశక్తి శాఖ ద్వారా నీటి వనరులను గుర్తించి పంటకోసం వినియోగించేలా చర్యలు తీసుకుందామని చెప్పారు.

మమతా డుమ్మా...కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ బిజీ
ప్రధానిగా రెండోసారి బాధ్యతలుచేపట్టాక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోడీ భేటీ కావడం ఇది తొలిసారి. ఇక నీతిఆయోగ్లో కూడా కొత్త సభ్యులను చేర్చారు. కొత్తగా నీతి ఆయోగ్ సభ్యులుగా చేరిన వారిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నారు. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ గైర్హాజరయ్యారు. బెంగాల్ సీఎం నీతి ఆయోగ్తో ఉపయోగం లేదని భావించి సమావేశానికి డుమ్మా కొట్టగా... కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ రాలేకపోయారు. మరోవైపు అనారోగ్యకారణంగా పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హాజరుకాలేకపోయారు.

ప్రజల విశ్వాసం గెలిచేలా రాష్ట్రాలు పనిచేయాలి
ఇక నీటి సమస్యతో పాటు ప్రధాని మోడీ పేదరికం, నిరుద్యోగం, వరదలు, కాలుష్యం, అవినీతి, హింస లాంటి సమస్యలపై కూడా మాట్లాడారు. ప్రజలు విశ్వాసం చూరగొనేలా ప్రభుత్వాలు పనిచేయాలని అందుకు అందరి సహకారం కావాలని ఈ సందర్భంగా మోడీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటి పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం, పారదర్శక పాలన అందించడంపైనే దృష్టి సారిస్తున్నామని మోడీ తెలిపారు. దేశతొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో ప్రణాళిక సంఘంగా ఏర్పడింది. దాన్నే ప్రధానిగా నరేంద్రమోడీ తొలి సారిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు 2014లో నీతి ఆయోగ్గా పేరు మార్చారు.












Click it and Unblock the Notifications