గత 24 గంటల్లో 11వేలకు చేరువలో కొత్త కరోనా కేసులు: లాక్ డౌన్ రూల్స్ పై పునరాలోచిస్తున్నపలు రాష్ట్రాలు
భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇక తాజాగా భారత దేశ పరిస్థితి ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు పెరుగుతున్న దేశాల జాబితాలో నాల్గవ స్థానానికి చేరుకుంది. యూకే ను అధిగమించి, ఇండియా కరోనా కేసులతో అత్యంత ప్రమాదకరమైన స్థితికి చేరుకుంటోంది.
Recommended Video

24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,956 కరోనా పాజిటివ్ కేసులు
భారతదేశంలో గత కొన్ని రోజులుగా నిత్యం దాదాపు 10 వేలకు దగ్గరలో కేసులు నమోదవుతున్నాయి. నిత్యం కేసుల పెరుగుదల కరోనా వైరస్ విషయంలోభారత దేశ పరిస్థితిని చాలా దారుణంగా తయారు చేస్తోంది.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,97,535 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8498 మంది కరోనా మహమ్మారి చేతిలో మరణించారు. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య రికార్డ్ బ్రేక్ చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,956 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక అలాగే 396 మంది కరోనా బారిన పడి మరణించారు.

రికవరీ ఎక్కువగా ఉండటం భారతదేశంలో సంతోషించదగ్గ పరిణామం
కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం కేసులసంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే భారతదేశంలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగడంలేదని ఐసీఎంఆర్ పేర్కొంటుంది. ఇక భారత దేశంలో కరోనా యాక్టివ్ గా ఉన్న కేసులు ఇప్పటివరకు 1,41,842 మంది కాగా, కరోనా మహమ్మారితో పోరాడి బయటపడిన వారు 1,47,194 మంది. కరోనాతో పోరాడుతున్నవారి కంటే, భారతదేశంలో కరోనా వైరస్ నుంచి బయటపడిన వారే ఎక్కువ మంది ఉన్నారు. రికవరీ ఎక్కువగా ఉండటం భారతదేశంలో సంతోషించదగ్గ పరిణామం.

మహారాష్ట్రలో కరోనా కల్లోలం .. లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగించాలని పలు రాష్ట్రాల నిర్ణయం
దాదాపు 100,000 కరోనా కేసులతో మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఇప్పటికే మహారాష్ట్రలో అత్యధికంగా గత 24 గంటల్లో 3,254 కేసులు, 149 మరణాలు నమోదయ్యాయి. ముంబైలో మాత్రమే 1,500 కేసులు, 97 మంది మరణించారంటే ముంబై లో తాజా పరిస్థితి అర్ధం అవుతుంది. కేసుల సంఖ్య పెరగడంతో, వారాంతాలు మరియు సెలవు దినాలలో లాక్డౌన్ సమయంలో విధించిన ఆంక్షలను తిరిగి తీసుకురావాలని పంజాబ్ నిర్ణయించింది, ఉత్తరాఖండ్ అదే మార్గంలో నడుస్తుంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఢిల్లీ నుండి రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రజలకు పరీక్షా ధృవీకరణ తప్పనిసరి చేయాలని ఆదేశించారు.

యూకేని దాటి కరోనా కేసుల్లో ఇండియా.. నాల్గవ స్థానంలో భారత్
ఇక ప్రపంచ వ్యాప్తంగా 75,13,208 మందికి కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశంగా యూఎస్ ఉంది. కరోనా దెబ్బకు యూఎస్ తీవ్ర సంక్షోభంలో పడింది. గత 24 గంటల్లో యూఎస్ లో 1,13,774 మంది మరణించారు అంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతి స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో రష్యా ఉన్నాయి. ఇక ఆ తర్వాత నాలుగో స్థానంలో ఉన్న యూకే ను అధిగమించి భారత్ నాలుగో స్థానానికి చేరింది. కేసులు పెరుగుతున్నప్పటికీ, రికవరీ ఎక్కువగా ఉండటంతో భారతదేశ ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications