చైనాకు ధీటుగా లఢక్ సరిహద్దుల్లో వైమానిక బలగాలను మోహరింపజేసిన కేంద్రం: ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలో భారత్-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఏడాదిన్నర కాలంగా కొనసాగుతూ వస్తోన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంటూ వస్తోన్నాయి. ఒకవంక భారత్తో చర్చలు కొనసాగిస్తూనే.. సరిహద్దులకు అవతల చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ.. కీలకమైన పోస్టుల నుంచి వెనక్కి తగ్గట్లేదు..సైన్యాన్ని ఉపసంహరించుకోవట్లేదు. అదే సమయంలో సమీపలోని ఎయిర్ బేస్ వద్ద తన వైమానిక బలగాలను పెంచుకుంటూ పోతోంది.

న్యోమా ఎయిర్ బేస్ కేంద్రంగా..
అత్యాధునిక హెలికాప్టర్లను ల్యాండ్ చేసేలా వాటిని బలోపేతం చేస్తోంది. చైనా దుందుడుకు చర్యలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వస్తోన్న భారత్ కూడా.. వైమానిక బలగాలను మోహరింపజేయడంపై దృష్టి సారించింది. వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న న్యోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ఎయిర్ బేస్ను కేంద్ర బిందువుగా చేసుకుని ప్రత్యేక హెలికాప్టర్లను ల్యాండ్ చేసే సౌకర్యాన్ని మెరుగుపర్చుకుంటోంది.

14,000 అడుగుల ఎత్తులో..
ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా సరే.. హెలికాఫ్టర్లను ల్యాండ్ చేసేలా న్యోమా ఎయిర్బేస్ను అప్గ్రేడ్ చేసింది. ప్రత్యేకించి- చిన్హుక్, అపాచీ హెలికాప్టర్ల ఆపరేషన్స్ను ముమ్మరం చేస్తోంది. న్యోమా ఎయిర్ బేస్ వద్ద ఓ చిన్నస్థాయి యుద్ధ విమానాల విన్యాసాలను నిర్వహిస్తోంది. న్యోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ఎయిర్ బేస్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైయిన ప్రదేశంలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్గా దీనికి గుర్తింపు ఉంది. 14,000 అడుగుల ఎత్తున ఉన్న ఎయిర్ బేస్ ఇది.

మిగ్ కూడా..
వ్యూహాత్మకంగా, భౌగోళికంగా.. భారత వైమానిక దళానికి అత్యంత కీలకమైంది. తక్షణ అవసరాలకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దింది. చిన్హుక్, అపాచీ హెలికాప్టర్ల ఆపరేషన్స్ను ముమ్మరం చేస్తోంది. మిగ్ 17 ఫైటర్ హెలికాఫ్టర్లను అక్కడ మోహరింపజేస్తోంది. సరిహద్దుల్లో పహారా కాస్తోన్న జవాన్లకు అవసరమైన సామాగ్రిని చేరవేయడానికి ఈ మూడు రకాల హెలికాప్టర్లను వినియోగిస్తోంది. దీనితోపాటు మధ్యస్థాయి బరువులను మోయడానికి వినియోగించే మిగ్-17వీ5 రకానికి చెందిన హెలికాఫ్టర్లను మోహరించింది.

చిన్హుక్ హెలికాప్టర్..
చిన్హుక్ హెలికాఫ్టర్లను వైమానిక దళాధికారులు న్యోమా ఎయిర్బేస్లో మోహరింపజేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఏకకాలంలో పలు అవసరాల కోసం వినియోగించుకునే హెలికాఫ్టర్ ఇది. డబుల్ రోటార్ సౌకర్యం ఉంటుంది ఇందులో. యుద్ధ సామాగ్రిని చేరవేయడానికి వైమానిక దళాధికారులు దీన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. 1962లో తొలిసారిగా ఇది వైమానిక దళంలో చేరింది. 9.6 టన్నుల బరువు ఉండే ఈ హెలికాఫ్టర్ హెవీ మిషనరీని మోసుకెళ్లగలదు. అదే సమయంలో శతృవులపై దాడులను కూడా చేయగలదు.

అపాచీ సైతం..
సరిహద్దుల్లో పహారా కాసే జవాన్లకు అవసరమైన నిత్యావసర సరుకులను తరలించడానికి కూడా ఈ రకం హెలికాఫ్టర్ను వినియోగిస్తోంటారు. లఢక్ వద్ద నెలకొనే సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ ఈ హెలికాఫ్టర్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇక 16 అడుగుల ఎత్తు, 18 అడుగుల పొడవు ఉన్న అపాచి హెలికాప్టర్లను కూడా వైమానిక దళాధికారులు సరిహద్దుల వద్ద మోహరింపజేస్తోన్నారు. డబుల్ ఇంజిన్ ఉన్న హెలికాప్టర్ ఇది.
Recommended Video

మల్టీపర్సస్ హెలికాప్టర్ల మోహరింపు..
గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు. ఇది కూడా మల్టీపర్సన్ హెలికాఫ్టర్. ఏకకాలంలో పలు రకాల కార్యక్రమాల కోసం దీన్ని వినియోగించుకునే సౌకర్యం ఉంది. యుద్ధ సామాగ్రిని చేరవేయడానికి మాత్రమే కాకుండా.. 16 యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను సంధించే సామర్థ్యం దీని సొంతం. 30 ఎంఎం సైజ్ గల 1,200 బుల్లెట్లను ఇందులో అమర్చిన రైఫిల్లో ఫిల్ చేయవచ్చు. ఒకవంక సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి చర్చలు కొనసాగిస్తూనే.. రెండు దేశాలు కూడా వైమానిక బలగాలను మోహరింపజేసుకోవడం వల్ల లఢక్ తూర్పు ప్రాంత సరిహద్దులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతోన్నాయి.












Click it and Unblock the Notifications