ఇండియాటుడే ఎగ్జిట్ పోల్స్: జార్ఖండ్ లో కాంగ్రెస్-జేఎంఎం పాగా..!
రాంచి: జార్ఖండ్ లో భారతీయ జనతా పార్టీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయమని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. వరుసగా మరోసారి అధికారంలోకి రావాలనే బీజేపీ ఆశలపై జార్ఖండ్ ఓటర్లు నీళ్లు చల్లినట్లు స్పష్టం చేస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం)-రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సంకీర్ణ కూటమి జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ పడింది.
Spick Media Network exit polls: కాంగ్రెస్కే పట్టం కట్టిన జార్ఖండ్
12,489 మంది అభిప్రాయాలు..
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఓటర్ల మనోభావాలపై ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే నిర్వహించింది. మొత్తం 12,489 మంది అభిప్రాయాలను ఇండియా టుడే సేకరించింది. ఇందులో 76 శాతం మంది పురుషులు, 24 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారిలో అధికశాతం మంది ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటిమి వైపు మొగ్గు చూపినట్లు ఇండియా టుడే వెల్లడించింది.
కాంగ్రెస్ దే పైచేయి..
కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమికి 38 నుంచి 50 సీట్లు రావడం ఖాయమని అంచనా వేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సైతం కాంగ్రెస్ సంకీర్ణ కూటమి కైవసం చేసుకునేలా కనిపిస్తోందని పేర్కొంది. భారతీయ జనతా పార్టీ కూటమి 22 నుంచి 32 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడింది. జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) 2 నుంచి 4, అఖిల జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 3 నుంచి 5 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఇతరులు 4 నుంచి 7 సీట్లను కైవసం చేసుకుంటారని తన ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది.
23న ఫలితాలు..
ఎగ్జిట్ పోల్స్ ద్వారా బీజేపీ నేతలకు కలవరపాటుకు గురి చేసిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెల్లడి కానున్నాయి. మొత్తం 81 స్థానాలకు అయిదు దశల్లో ఎన్నికలను నిర్వహించారు. 81 స్థానాలే కావడం వల్ల మధ్యాహ్నానికే దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల ఫలితాలు వెల్లడి అవుతాయి. ఓట్ల లెక్కింపును చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే జార్ఖండ్ లో అధికారాన్ని అందుకునేది ఎవరో.. ప్రతిపక్షంలో కూర్చునేది ఎవరో స్పష్టం అవుతుంది.