జేఎన్యూ టేప్స్: ‘పోలీసులే లైట్లు ఆపేశారు, దాడికి సాయపడ్డారు’
న్యూఢిల్లీ: గత ఆదివారం రాత్రి జవహర్లాల్ యూనివర్సిటీ(జేఎన్యూ) జరిగిన దాడికి సంబంధించి ఇండియా టుడే సంచలన కథనాలను ప్రచురితం చేసింది. ఆ దాడికి పాల్పడిన వారితో మాట్లాడి, వాటికి సంబంధించిన విషయాలను కథనాల్లో వెల్లడించింది. ఏబీవీపీ కార్యకర్తలుగా చెప్పుకుంటున్న దాడికి పాల్పడిన దుండగులు సంచలన విషయాలను వెల్లడించారు.
'ఇండియా టుడే' స్టింగ్ ఆపరేషన్ ప్రకారం.. ఏబీవీపీ కార్యకర్తగా తనకు తాను చెప్పుకున్న అక్షత్ అవాస్థి అనే వ్యక్తి.. ఆదివారం జేఎన్యూలో జరిగిన దాడిలో తాను కూడా పాల్గొన్నట్లు తెలిపాడు. జేఎన్యూ క్యాంపస్లో ఓ గుంపు వెళ్లి దాడులకు పాల్పడుతున్న సమయంలో ఢిల్లీ పోలీసులే లైట్లు ఆర్పేశారని చెప్పాడు.

ఇంకా కొట్టాలి అంటూ పోలీసులే దాడులకు పాల్పడిన గుంపు ప్రోత్సహించారని అతను చెప్పుకొచ్చాడు. అంతేగాక, దాడుల కోసం జనవరి 5న జేఎన్యూ లోపల నుంచి కొందరిని, బయట నుంచి కొందరిని తీసుకొచ్చినట్లు చెప్పాడు. కాగా, అక్షత్ అవాస్థి ప్రస్తుతం జేఎన్యూలో ఫ్రెంచ్ డిగ్రీ ప్రోగ్రాం చేస్తున్నాడు. ఆదివారం జరిగిన దాడికి సంబంధించిన సీసీఫుటేజీలో ఇతడు కూడా కనిపించాడు.
క్యాంపస్ లోపలే పోలీసులు ఉన్నారని.. బయట కాదని అవాస్థి చెప్పుకొచ్చాడు. పెరియార్ హాస్టల్లో అంతకుముందు జరిగిన దాడిలో ఓ విద్యార్థి గాయపడటంతో తానే పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపాడు. మనీష్ అనే విద్యార్థి దగ్గరకు వెళ్లిన ఓ పోలీసు ఇంకా కొట్టమని చెప్పాడని పేర్కొన్నాడు.
పోలీసులు ఏమన్నారని ఇండియా టుడే.. అవాస్థిని ప్రశ్నించగా.. ఇంకా కొట్టమని చెప్పారని తెలిపాడు.
రిపోర్టర్: వీధి లైట్లు ఎవరు ఆర్పేశారు? చెప్పండి?
అక్షత్ అవాస్థి: అడ్మిన్.. నా ఆలోచన ప్రకారం పోలీసులు
రిపోర్టర్: అయితే, పోలీసులు మీకు సాయం చేశారా? అంటే ఏబీవీపీ?
అక్షత్ అవాస్థి: ఇది ఎవరి పోలీసులు, సార్?
కాగా, అక్షత్ అవాస్థి ఏబీవీపీ సభ్యుడు కాదని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి జేఎన్యూలో ముసుగులు ధరించిన దుండుగులు కొందరి ప్రవేశించి విద్యార్థులపై కర్రలు, రాడ్లతో దాడులు చేసిన విషయం తెలిసిందే. జేఎన్యూ ఎస్యూ అధ్యక్షురాలు ఐషే ఘోష్ సహా పలువురు విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఈ దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వ పెద్దలతోపాటు విపక్షాలు, రాజకీయ, సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించారు.












Click it and Unblock the Notifications