కీలక మలుపు : పాక్ తో చర్చలకు భారత్ లేఖ
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా.. ఎర్రకోట నుంచి ప్రసంగించిన ప్రధాని మోడీ ప్రసంగానంతరం భారత్ పాక్ చర్చల్లో ఊపు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా చర్చలకు సిద్దమంటూ.. పాకిస్తాన్ కు లేఖ రాసింది భారత విదేశాంగ శాఖ.
కశ్మీర్ అంశంపై చర్చలకు రండి అంటూ పాక్ పంపిన లేఖకు సమాధానం ఇచ్చి భారత్.. సీమాంతర ఉగ్రవాదంపై మాత్రమే చర్చలు జరుపుతామని లేఖలో పేర్కొంది. కశ్మీర్ భారత్ లో అంతర్భాగం కాబట్టి, కశ్మీర్ సమస్యల గురించి మీతో చర్చించేది లేదని స్పష్టం చేసింది భారత్. ఈ మేరకు ఇస్లామాబాద్ లో ఉన్న భారత హైకమిషనర్ గౌతం బంబావాలే బుధవారం నాడు పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
సీమాంతర ఉగ్రవాదంపై చర్చకు సిద్దమని పాక్ కు తెలిపిన భారత్.. ఇందుకోసం భారత్ తరుపున విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ చర్చల్లో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారని పాక్ కు తెలిపింది. అయితే భారత్ అభిప్రాయంపై పాక్ తన అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉంది. ఐక్యారాజ్య సమితి తీర్మానం మేరకు కశ్మీర్ విషయంలో ఒక నిర్ణయానికి వద్దామని సోమవారం నాడు రాసిన లేఖలో పాక్ పేర్కొన్న విషయం తెలిసిందే.
కాగా, కశ్మీర్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్, బలూచిస్థాన్ లలో పాక్ అనుసరిస్తున్న దమనకాండను ఎత్తిచూపాలన్న వ్యూహంతోనే భారత్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల ముగింపు సందర్భంలోను.. మొన్నటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంలోను మోడీ పాక్ వైఖరిని ఎండగట్టిన సంగతి విదితమే.