పాక్పై దాడి చేసేందుకు భారత ఆర్మీకి అన్ని అధికారాలు ఇచ్చాం: జైట్లీ
ఢిల్లీ: గురువారం భారత జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్పై దాడులకు తెగబడ్డ జైషే మహ్మద్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాని నేతృత్వంలో భద్రతపై హైలెవెల్ క్యాబినెట్ కమిటీ సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. దేశం కోసం అమరులైన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం వహించామని చెప్పిన జైట్లీ దేశం కూడా రెండు నిమిషాలు మౌనం వహించాలని కోరారు.
ఇక అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తీరును ఎండగడుతామని ఆ దేశాన్ని ఒంటరిని చేస్తామని వెల్లడించారు. ఎవరైతే పాకిస్తాన్కు నిధులు ఇస్తున్నారో అలాంటి దేశాలు నిధులు విడుదల చేయడం నిలిపివేయాలని కోరుతామన్నారు. ఈ బాధ్యతను కేంద్ర ఆర్థిక శాఖ తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు విదేశీ వ్యవహారాల శాఖ కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని జైట్లీ చెప్పారు.
పుల్వామా దాడులు: ఆ దేశ తరహా దాడులు జరుగుతాయని ముందే హెచ్చరించిన ఇంటెలిజెన్స్
గురువారం జరిగిన దాడి పాక్ కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోందని ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు అంతర్జాతీయ వేదికలపై చూపిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అదే సమయంలో దేశం కూడా అండగా నిలవాలని జైట్లీ పిలుపిచ్చారు.
ఇక భారత ఆర్మీకి అన్ని అనుమతులు ఇచ్చామని ఉగ్రమూకలను ఏరిపారేసేందుకు ముందుకెళ్లాల్సిందేనని సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ఆర్మీ సరైన సమయంలో గట్టి గుణపాఠం పాకిస్తాన్కు చెబుతుందని ఇందుకోసం ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందని సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు జైట్లీ. ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని వదిలిపెట్టేది లేదని వెల్లడించారు అరుణ్ జైట్లీ.