అప్పటిదాకా భారత్ ఎంత మాత్రమూ సురక్షితం కాదు: తేల్చి చెప్పిన అమిత్ షా
పశ్చిమ బెంగాల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్ రక్షణను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సిలిగురిలో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో సశస్త్ర సీమ బల్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయ పరిపాలనా భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. దేశ సరిహద్దులు బలోపేతం కానంత వరకూ భారత్ ఎంత మాత్రం సురక్షితంగా కాదని తేల్చి చెప్పారు. నలుమూలలా వ్యాపించి ఉన్న సరిహద్దులను మరింత పటిష్ట పర్చుకోవాల్సి ఉందని అన్నారు. సిలిగురి కారిడార్ను దేశంలో అత్యంత సున్నితమైన, భౌగోళిక వ్యూహాత్మక ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు దీనికి తగిన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు.

దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఈ చికెన్స్ నెక్ ప్రాంత భద్రత దేశ సార్వభౌమాధికారానికి ఎంతో కీలకమని అమిత్ షా అన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించనున్న భారీ ఎస్ఎస్బీ పరిపాలనా భవనం సరిహద్దు రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షించడానికి, పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేయడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. జాతీయ భద్రత విషయంలో కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
దేశంలో శాంతిభద్రతలు వర్ధిల్లాలన్నా, పశ్చిమ బెంగాల్తో పాటు దేశమంతటా సురక్షిత వాతావరణం నెలకొనాలన్నా సరిహద్దు వెంబడి శత్రువుల కదలికలను పూర్తిగా అరికట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా భద్రతా బలగాలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు కంచె వేయాలని కేంద్రం భావించినప్పటికీ.. దీనికి కావలసిన భూమిని కేటాయించడంలో గత మమత బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. సరిహద్దుల రక్షణ పటిష్ట పర్చడానికి తాము 2014 నుంచి దాదాపు 1,129 ఎకరాల భూమిని పదేపదే కోరుతున్నప్పటికీ నాటి పాలకుల నుంచి సరైన సహకారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ రక్షణ కోసం రేయింబగళ్లు శ్రమిస్తున్న సేనలను రాజకీయాలకు అతీతంగా చూడాలని అమిత్ షా ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా దళాలైన ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్ వంటివి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడే పవిత్రమైన విధుల్లో ఉన్నాయని, వాటిని రాజకీయ కోణంలో చులకనగా చూడడం సరికాదని హితవు పలికారు. గతంలో స్థానిక పాలకులు ఈ సరిహద్దు భద్రతా బలగాల అధికారిక సామాజిక కార్యక్రమాలకు హాజరుకాకపోవడం ప్రజాస్వామ్యంలో తప్పుడు సంకేతాలను పంపిందని ఆయన విమర్శించారు.
నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలతో భారతదేశ సరిహద్దులను అప్రమత్తంగా కాపాడటంలో సశస్త్ర సీమ బల్ కీలక పాత్ర పోషిస్తోందని, ఈ వివాద రహిత సరిహద్దుల గుండా జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాలను, స్మగ్లింగ్ ముఠాలను నిరోధించడంలో ఎస్ఎస్బీ విశేష సేవలందిస్తోందని అమిత్ షా ప్రశంసించారు. ఇప్పుడు నూతనంగా ఏర్పాటవుతున్న మౌలిక వసతులు ఎస్ఎస్బీ వ్యూహాత్మక సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ఈ సరిహద్దుల వెంబడి జరిగే చురుకైన నిఘా వ్యవస్థకు మరింత శక్తిని ఇస్తాయని పునరుద్ఘాటించారు.














Click it and Unblock the Notifications