అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అగ్నివీరుల నియామకాలకు ఆర్మీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నియామకాల ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. ఆన్ లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వివాదాస్పదమైన పథకం.. అగ్నిపథ్. త్రివిధ దళాల్లో చేరడానికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన స్కీమ్ ఇది. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత చెలరేగింది. వేలాదిమంది అభ్యర్థులు తమ నిరసన ప్రదర్శనలను వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించారు. రైల్వే స్టేషన్లు, రైళ్లను తగులబెట్టారు. సికింద్రాబాద్లోనూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి.
నియామకాలకు..
అదే సమయంలో పలువురు అభ్యర్థులు ఈ అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను సైతం ఆశ్రయించారు. దీనిపై వ్యతిరేకత కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్మీ అధికారులు నియామకాలకు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అగ్నివీరుల నియమాకాలు దశలవారీగా కొనసాగుతున్నాయి. అర్హత గల వారు అగ్నిపథ్ కింద సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతోన్నారు. విశాఖపట్నంలోనూ అగ్నివీరుల నియామకాలు జరిగాయి.
కీలక మార్పులు..
ఇప్పుడు తాజాగా ఆర్మీ అధికారులు అగ్నివీరుల ఎంపిక ప్రక్రియలో కీలక మార్పులు చేశారు. అగ్నివీరుల కోసం ఆన్ లైన్ విధానంలో కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది. రిక్రూట్ మెంట్ ర్యాలీలకు బదులుగా ఇకపై ఆర్మీ అధికారులు చేపట్టబోయే అగ్నివీరుల నియామకాలన్నీ కూడా ఆన్ లైన్ విధానంలో ఉంటాయి. ఆన్ లైన్ విధానంలో అభ్యర్థులు తొలుత కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ను రాయాల్సి ఉంటుంది. దాని తరువాతే దేహ ధారుడ్య పరీక్షలను నిర్వహిస్తారు అధికారులు.
రిక్రూట్ మెంట్ ర్యాలీలకు బదులుగా..
ఆన్ లైన్ విధానంలో చేపట్టబోయే మొట్టమొదటి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఈ ఏడాది ఏప్రిల్ లో షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ లో ఆన్ లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మాత్రమే తదుపరి రౌండ్ లో దేహ ధారుడ్యం, మెడికల్ పరీక్షలను నిర్వహిస్తామని అన్నారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సుమారు 200 కేంద్రాల్లో ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి. పాన్ ఇండియా స్థాయిలో దీన్ని చేపట్టబోతోన్నట్లు ఆర్మీ అధికారులు వివరించారు.
రెండోవారంలో రిజిస్ట్రేషన్స్..
ఈ పరీక్షలు రాయడానికి ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. తమ దరఖాస్తులను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల రెండోవారంలో దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది. దరఖాస్తులను దాఖలు చేయడానికి గడువు నెలరోజుల పాటు ఉంటుంది. దీనికి సంబంధించిన తేదీలు ఇంకా ఖరారు కాలేదు.
అభ్యర్థుల ఎంపిక సులువు..
ఈ విధానం వల్ల దేశవ్యాప్తంగా అభ్యర్థులు ఒకేసారి ఆన్ లైన్ లో పరీక్షలను రాయగలుగుతారని, అగ్నివీరుల రిక్రూట్మెంట్ ర్యాలీలకు వేల సంఖ్యలో అభ్యర్థులు హాజరు కావాల్సిన పరిస్థితి కూడా తప్పుతుందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరింత సులభతరమౌతుందని చెప్పారు. ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే దేహధారుడ్యం, మెడికల్ టెస్టులకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు.