చైనాతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం - ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - ఎలా దెబ్బకొడతారంటే..
యుద్ధోన్మాదంతో సరిహద్దు వెంబడి కవ్వింపులకు దిగుతోన్న చైనాను భారత సైన్యం తీవ్రస్వరంతో హెచ్చరించింది. భయానకంగా ఉండే చలికాలంలోనూ డ్రాగన్ కోరలు పెరికేయడానికి.. పూర్తిస్థాయిలో యుద్ధం చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. చైనాతో యుద్ధం చేసే తెగువ, చలికాలాన్ని తట్టుకునే సత్తా ఇండియాకు లేదంటూ చైనా అధికారిక మీడియాలో వచ్చిన కథనాలపై మన ఆర్మీ ఘాటుగా స్పందించింది. లదాక్ లో సైనిక వ్యవహరాలను నిర్వహించే నార్తరన్ కమాండ్ అధికారిక ప్రతినిధి ఈ మేరకు బుధవారం పలు సంచలన అంశాలను వెల్లడించారు.
Recommended Video

పూర్తిస్థాయి యుద్ధం..
భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి తూర్పు లదాక్ లో గడిచిన 4 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మధ్యలో పలు మార్లు హింసాత్మక ఘర్షణలు.. ఇటీవలి కాలంలో గాల్లోకి కాల్పులు కూడా చోటుచేసుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. రాబోయే చలికాలంలో లదాక్ లో వాతావరణం పూర్తిగా మారిపోనున్న నేపథ్యంలో యుద్ధమే గనుక వస్తే భారత్ గెలిచే అవకాశమే లేదని చైనా అధికారిక కమ్యూనిస్టు పార్టీ మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ అదే పనిగా రెచ్చగొట్టేరాతలు రాసింది. వాటిపై స్పందిస్తూ.. లదాక్ లో శీతాకాలాలలో కూడా పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, చైనా కాలుదువ్విన మరుక్షణమే దానికి దిమ్మతిరిగేలా విరుచుకుపడతామని నార్తరన్ కమాండర్ అధికారిక ప్రతినిధి తెలిపారు.

భయానక వాతావరణంలో..
ఇంకొద్ది రోజుల్లో చలికాలం ప్రారంభం కానుందని, తూర్పు లదాక్ లో నవంబర్ నాటికి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయని, సైనికులు, వాహనాలు తిరగడానికి వీలు లేకుండా 40 అడుగుల మేర మంచు పేరుకుపోతుందని, అయితే, ఇలాంటి భయానక వాతావరణంలోనూ యుద్ధం చేయగల సత్తా భారత సైన్యానికి ఉందని ఆ అధికారి చెప్పారు. మంచుకొండల మధ్య కఠిన పరిస్థితుల్లోనూ నెగ్గుకురాగలిగేలా భారత సైన్యం శిక్షణ పొందిందని, చలికాలంలోనూ పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి శారిరకంగా, మానసికంగా దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సరిగ్గా ఇందుకు విరుద్ధంగా..

చైనీస్ ఆర్మీలో లోపాలు ఇవి..
పోరాడకుండానే గెలుపుకోసం అడ్డదారుల్లో ప్రయత్నించడం చైనాకు బాగా అలవాటని, ఆ విషయం ప్రపంచమంతటికీ తెలుసని, ఆ క్రమంలోనే చైనా సైన్యంలోని లోపాలను ఇతరులకు ఆపాదిస్తూ ‘గ్లోబల్ టైమ్స్' కథనాలతో కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నదని నార్తరన్ కమాండ్ అధికారి మండిపడ్డారు. ‘‘చైనా ఆర్మీలో మెజార్టీ జవాన్లు నగర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లే ఉన్నారు. లదాక్ లో విపరీతమైన చలిని తట్టుకునే సత్తా వాళ్లకు లేదు. శారీరకంగానేకాదు, మానసికంగానూ చైనా జవాన్లు మనకంటే చాలా బలహీనులు. అదే భారత సైన్యానికి.. మంచుపర్వతాల్లో యుద్ధ పరిస్థితులు కొత్తేమీకాదు. వేల మంది జవాన్లు ఈ మేరకు కఠిన శిక్షణ పొంది రెడీగా ఉన్నారు. అదీగాక ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం చియాసిన్ లోనూ మనం కీలకంగా వ్యవహరిస్తున్నాం. ఏ విధంగా చూసినా చైనా కంటే భారత సైన్యం ధీటుగా వ్యవహరించగలదు'' అని నార్తరన్ కమాండ్ అధికారి వ్యాఖ్యానించారు.

లాజిస్టిక్స్ ఇప్పటికే సిద్ధం..
చలికాలంలో విపరీతమైన మంచు కారణంగా దారులు మూసుకుపోవడం, ఆయుధాలు పనిచేయకపోవడం లాంటి సమస్యలను అధిగమించేందుకు ముందస్తుగానే సమాయత్తం అయినట్లు ఆర్మీ అధికారి చెప్పారు. దట్టమైన మంచులో సైనిక శిబిరాల నిర్వహణ, వేడి పుట్టించే యంత్రాలు, బాయిలర్లు, రేషన్ సరుకులు, ఆరోగ్య సమస్యలు తలెత్తితే అందుకోసం అవసరమైన వైద్యసామాగ్రి, ఆయుధాలను కండిషన్లో ఉంచగల వస్తువులు, సైనికులకు నాణ్యమైన దుస్తులు.. అన్నీ అందుబాటులో ఉంటాయని, ఇలా తీసి, అలా వాడుకునేందుకు వీలుగా లాజిస్టిక్స్ సిద్ధం చేసిపెట్టుకున్నామని ఆ అధికారి వివరించారు.

డ్రాగన్ తోక జాడిస్తే అంతే..
తూర్పు లదాక్ లో చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నార్తరన్ కమాండ్.. డ్రాగన్ దూకుడును బట్టే తమ ప్రతిచర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. శాంతిని కోరుకునే దేశంగా.. సరిహద్దు వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ ప్రయత్నిస్తున్నదని, ఆ క్రమంలోనే సైనిక, దౌత్య మార్గాల్లో భేటీలు జరుగుతున్నాయని, ఒకవేళ ఈలోపే చైనాగానీ తోకజాడితే కత్తిరించడానికి వెనుకాడబోమని హెచ్చరించింది.

రోడ్డు మార్గాలు.. ఎయిర్ బేస్లు..
లదాక్ లోకి వెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న రెండు మార్గాలు (జోజిలా (శ్రీనగర్-లే హైవే), రోహ్తాంగ్ పాస్ (మనాలి-లేహ్))కుతోడు కొత్తగా డార్చా నుంచి లేహ్ వరకు మూడవ రహదారి కూడా అందుబాటులోకి వచ్చిందని, దీంతో లాజిస్టిక్స్ సమస్య దాదాపుగా ఉత్పన్నం కాబోదని ఆర్మీ అధికారి తెలిపారు. రోహ్తాంగ్ మార్గంలో కీలకమైన అటల్ టన్నెల్ పూర్తి చేయడం వల్ల లాజిస్టిక్ సామర్థ్యాలు మరింతగా మెరుగుపడతాయన్నారు. రోడ్డు మార్గాలే కాకుండా.. మనకు పెద్ద సంఖ్యలో ఎయిర్బేస్లు కూడా అందుబాటులోకి వచ్చాయని, వాటి సహాయంతో సైన్యాన్ని చక్కగా నిర్వహించగలమని, మంచును తొలగించే ఆధునిక యంత్రాలను కూడా ఈ మార్గంలో మోహరింపజేశామని నార్తరన్ కమాండన్ అధికారి వివరించారు.












Click it and Unblock the Notifications