"భవిష్యత్ యుద్ధాలకు భారత సైన్యం సిద్ధం"
భవిష్యత్తు యుద్ధాల కోసం భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ తెలిపారు. ప్రస్తుతం యుద్ధాల రకాలు మారిపోయాయని వ్యూహాత్మకమైన నిర్ణయాలు అవసరం అని స్పష్టం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తమను తాము మార్చుకుంటూ సైన్యంలో అవసరమైన మార్పులు తీసుకొస్తున్నట్లు వివరించారు. రాజస్థాన్ లోని జైపూర్ లో 78వ సైనిక దినోత్సవ పరేడ్ తర్వాత ద్వివేది విలేకర్లతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
"ఫ్యూచర్ రెడీ ఫోర్స్ గా భారత సైన్యం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ముందుకు వెళ్తోంది. పటిష్టంగా ట్రైనింగ్ అయిన సైన్యం, అత్యాధునిక ఎక్విప్ మెంట్ సమకూర్చుకుంటున్నాం. సైన్యానికి మద్దతుగా టెక్నాలజీని మరింత చేరువచేస్తున్నాం" అని జైపూర్ లో నిర్వహించిన ఆర్మీ డే పరేడ్ లో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత ఆర్మీ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిసిపోయాయని ఉపేంద్ర ద్వివేదీ పేర్కొన్నారు. భారత సైన్యం సంయుక్తంగా, కచ్చితత్వంతో దాడులు నిర్వహించింది. భారత ప్రజల భద్రతే ముఖ్యం అని ఈ ఆపరేషన్ సింధూర్ చాటింది. అవసరమైనప్పుడు భారత్ సమర్థవంతంగా దాడులు చేస్తుందని నిరూపితమైనది అని ఉపేంద్ర ద్వివేదీ పేర్కొన్నారు. అలాగే తాము ప్రస్తుతం ఉన్న సవాళ్లే కాకుండా భవిష్యత్తు యుద్ధాలను సైతం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఈ మేరకు భైరవ్ బెటాలియన్, శక్తి బాన్ రెజిమెంట్ ను ఏర్పాటు చేసి సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

మరోవైపు జైపూర్ లో 78వ ఆర్మీ డే పరేడ్ ను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ భారీ కవాతుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పరేడ్ లో భాగంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గౌరవ వందనం స్వీకరించారు. ఈ మేరకు ఆయుధ వ్యవస్థలను సైన్యం ప్రదర్శించింది. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, అర్జున్ యుద్ధ ట్యాంకర్లు, దీర్ఘ శ్రేణి గైడెడ్ రాకెట్ పినాక, రోబో డాగ్స్, కే-9 వజ్ర వాహనాలు వంటి అధునాతున ఆయుధ వ్యవస్థలు, సాయుధ వాహనాలను పరేడ్ లో ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications