క్షణాల్లో వైరస్ మటాష్.. కరోనాపై యుద్దానికి భారత ఆర్మీ సరికొత్త ఆవిష్కరణలు..
కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ పాజిటివ్గా తేలే ప్రాంతాలను శానిటైజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం రకరకాల పరికరాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పనిని మరింత సులువు చేసేందుకు భారత ఆర్మీ అత్యాధునిక ఆవిష్కరణలతో కొత్త పరికరాలను,ఉత్పత్తులను తయారుచేస్తోంది. ఇందులో భాగంగా ఓ ప్రత్యేక డ్రోన్తో పాటు అతినీలలోహిత కిరణాలతో శానిటైజర్ను రూపొందించింది. అంతేకాదు 3డీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో సర్జికల్ మాస్కులను కూడా ఇండియన్ ఆర్మీ అభివృద్ది చేసింది.
ఇండియన్ ఆర్మీ ఏం చెబుతోంది..
ఆయుధాల రూపకల్పన, అభివృద్ధి, వాడకం,తనిఖీలకు బాధ్యత వహించే ఆర్మీ ఆయుధ మరియు సేవా శాఖ అయిన కార్పోరేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (EME) ఈ ఉత్పత్తులను అభివృద్ధి చేసింది. నిజానికి తమ కార్పోరేషన్కు ఇది రొటీన్ ప్రాక్టీస్ అని.. సంక్లిష్ట సమయాల్లో పరిమిత వనరుల నుంచి కొత్త ఆవిష్కరణలు చేయడం గతం నుంచే ఉన్నదే అని ఓ సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు. తాజాగా అభివృద్ది చేసిన పరికరాలు,ఉత్పత్తులు పూర్తిగా ఆర్మీ తమకున్న పరిజ్ఞానంతో రూపొందించినవేనని చెప్పారు. సొంతంగా వీటిని తయారుచేసే సామర్థ్యం తమకు ఉందని... అయితే ఇతర పరిశ్రమలతో కలిసి సంయుక్తంగా కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. తద్వారా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఈ పరికరాలు, ఉత్పత్తులను చేరవేయవచ్చునన్నారు.
డ్రోన్ పనితీరు ఎలా ఉంటుంది..
ఈ డ్రోన్కు అమర్చిన క్వాడ్ కాప్టర్స్,రోటార్స్ సాయంతో తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతంలో శానిటైజేషన్ స్ప్రే చేయవచ్చు. ఉదాహరణకు ఒక ఫుట్ బాల్ మైదానాన్ని 10మీ. ఎత్తులో కేవలం 10 నిమిషాల్లో ఇది శానిటైజ్ చేయగలదు. క్వాడ్కాప్టర్లో దాదాపు 5 లీటర్ల వరకు శానిజైటేజ్ లిక్విడ్ను నింపవచ్చు. ప్రస్తుతం ఢిల్లీలోని 505 ఆర్మీ బేస్లో దీన్ని పరీక్షిస్తున్నారు. దీని విలువ రూ.7.5లక్షలు. ఆర్మీ రెండు వారాల్లో దీన్ని తయారుచేయగలదని.. బ్యాటరీల అందుబాటుపై తయారీ ఆధారపడి ఉందని అధికారులు వెల్లడించారు.
యూవీ శానిటైజర్..
అతినీలలోహిత కిరణాలనే (UV-light) శానిటైజర్గా ఉపయోగించే విధానాన్ని ఆగ్రాలోని 509 ఆర్మీ బేస్ తయారుచేసింది. ఈ ప్రక్రియలో యూవీ కిరణాలతోనే వైరస్ను నిర్మూలిస్తారు. ఎక్కడైతే శానిటైజేషన్ చేయాలో.. ఆ ప్రదేశంలో 6 అంగుళాల ఎత్తున తక్కువ తరంగ దైర్ఘ్యం కలిగిన యూవీ కిరణాలను ప్రసరింపజేస్తారు. దీంతో కేవలం 20 సెకన్లలోనే ఆ ప్రదేశంలో వైరస్ నశించిపోతుంది. ఉపరితలంపై ఉన్న బాక్టీరియాను చంపేయడంలో ఈ శానిటైజర్ 99.9శాతం ఉపయోగపడుతుందని ఆర్మీ వెల్లడించింది.
3డీ సర్జికల్ మాస్కులు..
3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో సర్జికల్ మాస్కులను కూడా ఆర్మీ తయారుచేసింది. దీని ధర రూ.1200. అలాగే థర్మల్ స్కానర్లతో పాటు యాంటీ ఏరోసాలినేషన్ బాక్సులను కూడా తయారుచేసింది. ఈ బాక్సులను పారదర్శక ఆక్రిలిక్ షీట్లతో తయారుచేస్తారు. ఇవన్నీ డాక్టర్లు,హెల్త్ కేర్ సిబ్బందిని రక్షణకు ఉపయోపగపడుతాయని ఆర్మీ వెల్లడించింది. ఓవైపు సరిహద్దుల్లో రక్షణపై దృష్టి సారిస్తూనే మరోవైపు కరోనాపై యుద్దంలో భారత్కు అండగా నిలబడేందుకు ఆర్మీ చేస్తున్న ఈ కృషిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.