పాకిస్థాన్కు షాకిచ్చిన బ్రిటన్ ఎంపీలు: ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు, భారత సైన్యంపై ప్రశంసలు
లండన్: పాకిస్థాన్కు బ్రిటన్ పార్లమెంటు భారీ షాక్ తగిలింది. అదే సమయంలో భారత్కు అనూహ్య మద్దతు లభించింది. గురువారం హౌస్ ఆఫ్ కామన్స్లో బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ నుంచి భారత భద్రతా దళాలు వెనక్కి వెళితే ఆప్ఘనిస్థాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు.
జమ్మూకాశ్మీర్లో అక్కడి మత చాందసవాద మూకలు ధ్వంసం చేస్తాయని వ్యాఖ్యానించారు. కాశ్మీర్పై చర్చలో ఆయన ఈ మేరకు స్పందించారు. జమ్మూకాశ్మీర్ అంశంపై చర్చను డెబ్బీ అబ్రహామ్స్, పాకిస్థాన్ మూలాలున్న ఎంపీ యాస్మిన్ ఖురేషీలు ప్రవేశపెట్టారు. ఈ చర్చ సందర్భంగా ఎంపీ బ్లాక్మన్ మాట్లాడారు.
మనం ఆప్ఘనిస్థాన్లో జరిగిందేమిటో ప్రత్యక్షంగా చూశాం. అలాంటి సమస్యే జమ్మూకాశ్మర్లో ఉంది. ఇక్కడ ఇస్లామిక్ చాందసవాద శక్తులు ప్రజాస్వామ్యాన్ని కుప్పకూలుస్తాయి. జమ్మూకాశ్మీర్ను మరో ఆప్ఘనిస్థాన్లా కాకుండా కాపాడింది ఒక్క భారత సైన్యం మాత్రమే. ఆర్టికల్ 370 రద్దు చేసి భారత ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. వాస్తవాలను గుర్తించాలని తోటి ఎంపీలకు ఆయన చురకలంటించారు.
అంతకుముందు హౌస్ ఆఫ్ కామన్స్లో మరో ఎంపీ గార్డినర్ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. పాకిస్థానే తాలిబన్ నాయకులకు ఆశ్రమిచ్చిందని ఆరోపించారు. ఐఎస్ఐ వారికి, ఇతర ఉగ్రవాద సంస్థలకు అవసరమైన సేవలను అందించిందిన పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్లో ప్రజలు శాంతియుత జీవనం సాగిస్తున్నారని చెప్పారు. త్రిపుల్ తలాక్, 14 ఏళ్లకే బాలికలకు వివాహాలు లాంటి దురాచారాలు కూడా రద్దయిపోయాయని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుకు పూర్వం జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగేవని, మైనార్టీలకు రక్షణ లేదని చెప్పారు. ఆర్ఠికల్ రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్లో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని తెలిపారు. మహిళలకు, పిల్లలకు రక్షణ ఏర్పడిందని చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూకాశ్మీర్లోని మైనార్టీలైన హిందువులు, సిక్కులు, బౌద్ధులను ఛాందసవాదులు బెదిరింపులకు గురిచేసి అక్కడ్నుంచి తరిమేశారని చెప్పారు. వారిపై తరచూ దాడులు జరుగుతూనే ఉండేవన్నారు. బలవంతపు మతమార్పిడులు జరిగేవని తెలిపారు. ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్ లో ప్రజాజీవనం సాధారణంగా మారిందని, ఇప్పుడు ఇక్కడి ప్రజలంతా శాంతియుత వాతావరణంలో జీవిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గాయని తెలిపారు. భారత సైన్యం ఉగ్రమూకను ఏరిపారిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్మన్ స్పందనపై పాకిస్థాన్కు ఇస్తున్న ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు.
2019 ఆగస్టు 5 న, భారత రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్మూ కాశ్మీర్కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా పరిమిత స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు, జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కాశ్మీరును శాసనసభ కలిగి ఉండే కేంద్రపాలిత ప్రాంతం గాను (ఢిల్లీ లాగా), లడఖ్ ను సభ లేని కేంద్రపాలిత ప్రాంతం గానూ ఏర్పాటు చేసింది. దీంతో భారత చట్టాలు ఈ ప్రాంతాల్లో యథాతథంగా అమలవుతున్నాయి.