పహల్గాం దాడి పిరికిపంద చర్యే.. ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెబుతాం: రాజ్నాథ్ సింగ్
జమ్మూకశ్మీర్లో మరోసారి ఉగ్రవాదం పడగ విప్పింది. పర్యాటక కేంద్రంగా, కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన పహల్గాం ప్రాంతం ఉగ్రవాదుల భీకర దాడితో ఉలిక్కిపడింది. నిన్న మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసరన్ లోయ సమీపంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటనలో, సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు అమాయక పర్యటకులను అతి సమీపం నుంచి చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ దారుణానికి 28 మంది నిండు ప్రాణాలు బలైపోగా, పదుల సంఖ్యలో పర్యటకులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. దాడి అనంతరం అడవుల్లోకి పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ దారుణ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాంలో పర్యటకులపై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ అకృత్యంలో అమాయక పర్యటకులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టించడమే భారత్ విధానమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో యావత్ దేశ ప్రజలు ఐక్యంగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్పై కుట్ర పన్నుతున్న వారిని, ఈ దాడికి పాల్పడిన వారికి తగిన బుద్ధి చెబుతామని, వారిని ఊరికే వదలబోమని గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదులకు భారత్ తప్పకుండా గట్టి బదులిస్తుందని స్పష్టం చేశారు. ఈ దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
పహల్గాం ఘటనకు సంబంధించి, శ్రీనగర్తో పాటు కశ్మీర్ లోయలోని భద్రతా పరిస్థితులపై రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠితో ఆయన చర్చలు జరిపిన అనంతరం ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) కీలక సమావేశంలోనూ రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. ఈ దాడి నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పహల్గాం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అమాయక పర్యటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దారుణం యావత్ దేశంలో ఆగ్రహావేశాలను రగిల్చింది.












Click it and Unblock the Notifications