ఫోన్లో పెగాసస్ జొప్పించారు! కొందరు హెచ్చరించారంటూ కేంబ్రిడ్జిలో రాహుల్ గాంధీ
కేంబ్రి యూనివర్సిటీ వేదికగా భారత ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.
లండన్: కేంబ్రి యూనివర్సిటీ వేదికగా భారత ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. లండన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. తనపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ఉపయోగించిందన్నారు.
21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ.. పనిలో పనిగా భారత ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. తన ఫోన్లోకి పెగాసస్ జొప్పించారన్నారు. చాలా మంది రాజకీయ నాయకుల ఫోన్లపైనా ఇలాగే నిఘా పెట్టారన్నారు. దీనిపై కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు తనకు కాల్ చేసి.. మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. మీ మాటలను రికార్డు చేస్తున్నాం అని హెచ్చరించినట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు.

గత కొన్నేళ్లుగా తాము ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని, క్రిమినల్ చట్టాల పరిధిలోకి రాని ఎన్నో అంశాల ఆధారంగా తనపై కేసులు పెడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అన్నారు.
ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లాంటి పార్లమెంటు, స్వేచ్ఛాయుత మీడియా, న్యాయవ్యవస్థ వంటి వాటిని నిర్బంధిస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా పార్లమెంటు సమీపంలో పోలీసులు తనను అరెస్ట్ చేసినప్పటి ఓ ఫొటోను రాహుల్ ప్రదర్శించారు. పార్లమెంట్ హౌజ్ ముందు ప్రతిపక్ష నేతలంతా నిలబడి ఏదో ఒక విషయంపై చర్చించినందుకు వారందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారని రాహుల్ తెలిపారు. కొన్ని హింసాత్మక ఘటనలు కూడా జరుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications