గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికన్ను ఉన్నాడో రాజు: భారత్పై రాజన్ ఆసక్తికరం
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'అంధుల రాజ్యంలో ఒంటికన్ను ఏలిక ఉన్నవాడే రాజు' అని భారత ఆర్థిక వ్యవస్థ పైన వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ ఆర్థిక రంగంలో భారత్ ప్రస్తుత పరిస్థితిపై ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థలు కితాబివ్వడంపై రాజన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ మంచి పనితీరు కనబరుస్తూండటాన్ని గుడ్డివాళ్ల రాజ్యంలో ఒక కన్ను ఉన్నవాడే రాజు అని పోల్చారు.
ప్రపంచ దేశాలు మందగించిన వృద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటూంటే, భారత్ మెరుగైన వృద్ధి సాధిస్తూ ముందుకు దూసుకెళ్తొందన్న విషయాన్ని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక చాలు అని సరిపెట్టుకునే స్థాయికి ఇంకా మేం చేరుకోలేదని, అయితే ఒకటి మాత్రం చెప్పగలను, అందరూ గుడ్డివాళ్లే ఉన్న రాజ్యంలో ఒక కన్ను ఉన్నవాడే రాజని మాత్రం ఘంటాపథంగా చెప్పగలనని పేర్కొన్నారు.
భారత్లో గత కొద్దికాలంలో కొన్ని సానుకూల కార్యక్రమాలు జరిగాయన్నారు. అయితే మరిన్ని జరగాల్సి ఉందని చెప్పారు. కరెంట్ అకౌంట్ లోటు, విత్తలోటు విషయంలో భారత్ సాధించిన విజయాలు, ద్రవ్యోల్భణాన్ని 11 శాతం నుంచి 5 శాతానికి లాక్కురావడం.. ఇవి చెప్పుకోదగిన విజయాలు అన్నారు. వడ్డీరేట్లపై తగ్గింపుకు అవకాశం ఏర్పడిందన్నారు.
కొత్త దివాలా చట్టంతో పాటు జీఎస్టీలను అమల్లో తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చైనాతో పోలిస్తే సంస్కరణల అమల్లో దశాబ్దం వెనకబడ్డామనిస ఈ తేడా రెండు ఆర్థిక వ్యవస్థల పరిణామంలో తెలుస్తుందన్నారు.