సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్: దేశాన్ని దెబ్బకొడుతున్న మేధోవలస: ఛాతీ చించుకోవడం తప్ప..
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు మేధావులను అందిస్తోంది భారత్. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో మేధావులను తయారు చేస్తోంది. ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ప్రపంచాన్ని శాసిస్తోన్నకీలక సంస్థలను ఆడించేది..దిశానిర్దేశం చేస్తోన్నది మనవాళ్లే. భారతీయుల చేతుల్లోనే ఆయా దిగ్గజ కంపెనీలు మనుగడ సాగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ట్విట్టర్.. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అనేక కారణాల వల్ల వారంతా స్వదేశాన్ని వీడుతున్నారు.
భారత్కు ఒరిగిందేమిటి?..
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, గీతా గోపీనాథ్, శంతను నారాయణ్, లీనా నాయర్ వంటి నిపుణులు, మేధావులు ప్రపంచాన్ని ఏలుతున్నారు. వారి వల్ల భారత్కు ఒరిగిందేమైనా ఉందా? అంటే సమాధానం కోసం వెదుక్కోవాల్సి ఉంటుంది. పుట్టిన గడ్డకు పెద్దగా ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు వారి వల్ల. అప్పుడప్పుడూ తాము ఉన్నామంటూ ఉనికిని చాటుకోవడం తప్ప దేశాభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి లబ్ది కలగట్లేదు.
దెబ్బకొడుతున్న మేధోవలస..
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత.. మేధో వలస విపరీతంగా పెరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. వేర్వేరు రంగాలకు చెందిన లక్షలాది మంది నిపుణులు భారత్ నుంచి వలస వెళ్తోన్నారు. పుట్టిందిక్కడే.. చదివిందిక్కడే. తమ విజ్ఞానాన్ని, మేధస్సును మాత్రం పొరుగు దేశాల అభివృద్ధికి, సంపద సృష్టికి కేటాయిస్తోన్నారనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో భారత పౌరసత్వాన్ని కూడా వదులుకుంటున్నారు.
2014 నుంచి..
2014 నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు భారత్ను వదిలి వెళ్లిన మిలియనీర్ల సంఖ్య 23,000కు పైమాటే. ఒక్క 2019లోనే 7,000 మందికి పైగా మిలియనీర్లు భారత్ను వీడారు. విదేశాల్లో స్థిరపడ్డారు. 2015 నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య తొమ్మిది లక్షలకు పైమాటే. 2000-2020 మధ్యకాలంలో కోటి 80 లక్షల మంది భారతీయులు పొరుగు దేశాలకు తరలి వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. ఇది చాలు- మేధో వలస భారత్ను ఏ స్థాయిలో దెబ్బకొడుతోందో చెప్పుకోవడానికి.
2015 నుంచీ..
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2015లో 1,31,489, 2016లో 1,41,603, 2017లో1,33,049, 2018లో 1,34,561, 2020లో 85,242, 2021లో సెప్టెంబర్ వరకు 1,11,287 మంది భారతీయులు స్వదేశాన్ని వీడారు. వీరలో వేల సంఖ్యలో మిలియనీర్లు ఉన్నారు. స్వదేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతూనే ఉంది.
గర్వించడం తప్ప..
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పరాగ్ అగర్వాల్, గీతా గోపీనాథ్.. వంటి నిపుణులు భారతీయులని గర్వించడం ఒక్కటే మిగిలింది దేశానికి. ఈ బ్రెయిన్ డ్రెయిన్ అనేది మున్ముందు మరింత పెరుగుతుందే తప్ప తగ్గబోదనే అంచనాలు ఉన్నాయి. ఐటీ, ఫార్మాసూటికల్స్, ఫైనాన్స్, సర్వీస్ సెగ్మెంట్లల్లో ఇతర దేశాల్లో లభిస్తోన్న అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని, ఆయా రంగాల్లో అగ్రగామిగా తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారని చెబుతున్నారు. భారత్లో అలాంటి పరిస్థితులు లేకపోవడం ఓ కారణమని అంటున్నారు.