భారత్లో ఎన్ని న్యూస్ పేపర్లు ఉన్నాయో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రపంచంలో నిన్న ఏం జరిగిందో మన కళ్ల ముందుకు తీసుకొచ్చేదే న్యూస్ పేపర్. చాలా మందికి ఉదయాన్నే పేపర్ చదవందే రోజు ప్రారంభం కాదు. అలాంటి న్యూస్ పేపర్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. భారత్లో ప్రతిరోజూ ప్రచురితమవుతున్న న్యాస్ పేపర్ల సంఖ్య లక్ష దాటేసింది.
భారత వార్తాపత్రికల రిజిస్ట్రార్ (ఆర్ఎన్ఐ) లెక్కల ప్రకారం మార్చి 2013 నాటికి దేశవ్యాప్తంగా 94,067 పత్రికలుంటే ఈ ఏడాది మార్చి నాటికి వాటి సంఖ్య 1,05,443కి చేరింది. అత్యధికంగా వార్తా పత్రికలను ప్రచురిస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 16,130 వార్తా పత్రికలున్నాయి.
14,394 వార్తా పత్రికలతో రెండో స్ధానాన్ని మహారాష్ట్ర ఆక్రమించింది. దేశ రాజధాని ఢిల్లీలో 12,177 వార్తా పత్రికలను ప్రచురిస్తుంది. ఇక విభజన అనంతరం ఏపీలో వార్తాపత్రికల సంఖ్యలో అభివృద్ధి కనిపించింది. ఏపీలో 6,215 పత్రికలు ప్రచురిస్తుండగా, కొత్త రాష్ట్రం తెలంగాణలో 203 పత్రికలు మాత్రం చెలామణిలో ఉన్నాయి.
ఇక లక్షద్వీప్, నాగాలాండ్ రాష్ట్రాల్లో వరుసగా 7, 22 వార్తా పత్రికలు మాత్రమే ఉన్నాయి. ఇక, భాషా పరంగా చూస్తే దేశవ్యాప్తంగా 2014 నాటికి 13,138 ఇంగ్లీషు పేపర్లు ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 13,661కి పెరిగింది. ఇక, హిందీ పత్రికల సంఖ్య 40,159 నుంచి 42,493కి పెరిగింది. సంస్కృత పత్రికలు 80 నుంచి 95కి చేరాయి.