దేశంలో ఇక హైస్పీడ్ రైళ్లు.. 10 వేల కిలోమీటర్ల కారిడార్ నిర్మాణం, రైల్వేశాఖ నిర్ణయం
న్యూఢిల్లీ : రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్... దేశంలో హైస్పీడ్ రైళ్ల కోసం అవసరమయ్యే కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ నిర్ణయించింది. గంటకు 200 నుంచి 250 కిలోమీటర్ల వేగంతో ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.
ప్రస్థుతం ముంబై -పూణే నగరాల మధ్య రైలు ప్రయాణ సమయం మూడు గంటలు పడుతోంది. హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం ద్వారా ప్రయాణ సమయాన్ని గంటకు తగ్గించవచ్చని భావిస్తున్నారు.
ఈ విధానంలో భాగంగా తొలుత దేశంలో పదివేల కిలోమీటర్ల దూరం వరకు కొత్తగా హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తారు. దీనిపై కసరత్తు చేసి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రకటించాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్ణయించారు.
కిలోమీటరు రైల్వేట్రాక్ నిర్మాణానికి వంద కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ప్రస్తుతమున్న రైల్వే ట్రాక్ పక్కనే రైల్వే స్థలాల్లో లేదా జాతీయ రహదారుల పక్కనగాని ఈ హైస్పీడ్ రైలు ట్రాక్ నిర్మించాలని యోచిస్తున్నారు.