ఇక రైళ్లల్లోనూ.. విమాన తరహా భోజనం! బోర్డు ఓకే అనగానే, ధరలు భరించగలమా?
రైళ్లల్లో ప్రయాణికులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. విమానాల్లో సరఫరా చేసే ఆహారాన్ని రైళ్లలోని ప్రయాణికులకు అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఢిల్లీ: రైళ్లల్లో ప్రయాణికులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు భారతీయ రైల్వే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత మెనూని మార్చాలని నిర్ణయం తీసుకుంది.
విమానాల్లో సరఫరా చేసే ఆహారాన్ని రైళ్లలోని ప్రయాణికులకు అందించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన నివేదికను రైల్వే కమిటీ బోర్డుకు కూడా అందజేసింది.
రైల్వే బోర్డు కూడా ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే రైళ్లలో సరఫరా చేసే ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.గ్రేవీ లేకుండా ఆహార పదార్థాలను అందించాల్సిందిగా కమిటీ తన నివేదిక ద్వారా ప్రతిపాదించింది.
చికుబుకు చికుబుకు రైలే: ఢిల్లీలో నెలలో రెండుసార్లు కూతపెట్టనున్న.. 'స్టీమింజన్ రైలు'!
వెజిటేరియన్ బిర్యానీ, రాజ్మా ఛావల్, హక్కా నూడిల్స్, పులావ్, లడ్డూతో పాటు ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయాల్సిందిగా రైల్వే కమిటీ కోరింది.
కాగ్ అక్షింతల నేపథ్యంలో...
రైళ్లల్లో అందించే ఆహారం మనుషులు తినేదిగా కూడా లేదని, నాణ్యత లోపాలు ఎక్కువగా ఉన్నాయని గతంలో కాగ్ తన నివేదిక రైల్వే శాఖపై అక్షింతలు వేసిన విషయం తెలిసిందే.
దీంతో పాటు రైళ్లల్లో సరఫరా చేసిన ఆహార పదార్థాల్లో చనిపోయిన బల్లి, పురుగుల అవశేషాలు కనిపించిన సంఘటనలు గతంలో వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రైల్వే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కొన్ని రైళ్లల్లో ట్యాబ్లెట్లను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను వెంటనే సేకరిస్తోంది.