రైలు ప్రయాణీకులకు శుభవార్త: రైల్ మదద్, మెనూ ఆన్ రైల్
న్యూఢిల్లీ: దేశంలో రైల్వే ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ రెండు కొత్త మొబైల్ యాప్లను విడుదల చేసింది. వీటిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ విడుదల చేశారు. నాలుగేళ్ల మోడీ ప్రభుత్వం విజయాల ప్రచారం కోసం చెన్నై వచ్చిన గోయల్ కొత్త యాప్ల విడుదల అనంతరం మాట్లాడారు. రైల్ మదద్, మెనూ ఆన్ రైల్ పేరిట రెండు యాప్స్ తీసుకు వచ్చారు.
రైల్ మదద్ ద్వారా ప్రయాణీకులు తమ ఫిర్యాదులను రైల్వే శాఖకు తెలియజేయవచ్చు. ప్రయాణీకుల భద్రత, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లను అనుసంధానం చేస్తూ ఈ యాప్ రూపొందించారు. మెనూ యాప్ సహాయంతో ప్రయాణీకులు తమకు ఇష్టమైన ఆహారం, పానియాలు, వాటి ధరలను తెలుసుకోవచ్చు. 96 రకాల ఫలహారాలు, ఆహారపదార్థాలు మెనూలో ఉంటాయి. జైన్ ఫుడ్, డయాబెటిక్ ఫుడ్, బ్రేక్ ఫాస్టులు అందుబాటులో ఉంచారు.
శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ముందుగా ఆర్డరిస్తే అన్నిరకాల ఆహార పదార్థాలు సరఫరా చేస్తారు. రైల్వేలో భద్రతకు ప్రాధాన్యమిచ్చి రైలు ప్రమాదాల సంఖ్యను తగ్గించామని గోయల్ అన్నారు. 2013-14లో 118 రైలు ప్రమాదాలు జరగ్గా 2017-18లో వీటి సంఖ్యను 73కు తగ్గించామన్నారు. రైల్వేను ప్రయివేటీకరించమని గోయల్ చెప్పారు.
రైల్ మదద్
రైల్ మదద్ యాప్ను ఉపయోగించి ప్రయాణికులు ఫోన్ ద్వారా గానీ, వెబ్సైట్ ద్వారా గానీ తమ ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. వచ్చిన అన్ని రకాల ఫిర్యాదులను రైలు ప్రయాణికుల ఫిర్యాదులు, నిర్వహణ వ్యవస్థ(ఆర్.పి.జి.ఆర్.ఏ.ఎమ్.ఎస్)ద్వారా ఒకే వైదిక పైకి తీసుకురానున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు, రైళ్లు, రైల్వే స్టేషన్లు, వివిధ విభాగాల్లో పరిశుభ్రత, క్యాటరింగ్, సౌకర్యాలు వంటి సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడనుంది.
రైల్ మదద్ యాప్ను ఉపయోగించి ప్రయాణికులు కనీస సమాచారంతో ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదులకు ఫొటో జతచేసే సౌకర్యం ఉంది. ఒకసారి ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదుదారులకు తక్షణమే ఎస్సెమ్మెస్ ద్వారా ఒక ఐడీ వస్తుంది. రైల్ మదద్ యాప్ నుంచి తమ ఫిర్యాదుపై ఒక ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. రైల్వేకు సంబంధించిన చైల్డ్ హెల్ప్లైన్, రక్షణ వంటి పలు విభాగాల ఫోన్ నంబర్లనూ ఆ యాప్ అందుబాటులో ఉంచుతుంది. ఆ నంబర్లకు నేరుగా ఫోన్ చేసే సౌకర్యం కూడా ఈ యాప్లో ఉంది.
ప్రస్తుతం ఆఫ్లైన్, ఆన్లైన్లలో 14రకాలుగా ఫిర్యాదులు చేసేందుకు వీలుంది. ఆ ఫిర్యాదులన్నీటిని ఈ యాప్ను ఉపయోగించి ఒకే వైదిక పైకి తీసుకు వస్తారు. ఈ యాప్ ద్వారా ఏదేని ఒక రైలు, రైల్వే స్టేషన్ గానీ అక్కడ పని తీరులో పాటిస్తున్న ప్రమాణాలు తెలుసుకోవచ్చు. క్రమంగా అన్ని రైల్వే డివిజన్లు, జోన్లు, రైల్వే బోర్డుల్లో సమాచారం రైల్వే సంస్థ మేనేజ్మెంట్కు అందుబాటులోకి రానుంది. ఈ మెయిల్ ద్వారా ప్రతి వారం సంబంధిత అధికారులకు నివేదికలు వెళ్తాయి.