అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు - రామమందిర ట్రస్ట్ కీలక సూచన..!!
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. భారీగా భక్తులు అయోధ్యకు చేరుకొనేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం నాడు దేశ వ్యాప్తంగా ఆనంద్ మహోత్సవ్ నిర్వహణకు నిర్ణయించారు. భక్తుల రద్దీతో రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది.
అయోధ్య రామ మందిరాన్ని చేరుకోవాలనుకుంటున్న కోట్లాది మంది భక్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. భక్తులు అయోధ్యకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆలయం ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందు... జనవరి 19నుంచే ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అయోధ్య రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులు చేపట్టారు. రోజుకు 50వేల మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి చేసిన ఈ స్టేషన్ జనవరి 15 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

మరోవైపు అయోధ్యను సందర్శించే యాత్రికులకు 24గంటలూ కేటరింగ్ సేవలు అందించడానికి ఐఆర్సీటీసీ సన్నద్ధమైంది. కాగా, జనవరి 22న మధ్యాహ్నం 12గంటలకు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
ఆలయ పరిసరాల్లో రద్దీని నివారించడానికి 22న భక్తులు అయోధ్యకు రావొద్దని, తమకు సమీపంలోని మందిరాల్లో 'ఆనంద్ మహోత్సవ్'ను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, పుణె, నాగ్పూర్, లక్నో, జమ్ము, బెంగళూరు..ఇలా అన్ని ప్రాంతాల్లోని నగరాలను అయోధ్యకు కలుపుతూ 100 రోజులపాటు రైల్వే సేవల్ని కొనసాగిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. రోజూ 50 వేల మంది స్టేషన్లో దిగే విధంగా అయోధ్య స్టేషన్ను రీడిజైన్ చేశారు.












Click it and Unblock the Notifications