భారత్ పంట పండింది..! ఆ క్షిపణుల కోసం క్యూ కడుతున్న దేశాలు..!
భారతీయ రక్షణ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే పలు రక్షణ ఉత్పత్తులను విదేశాలకు విక్రయిస్తున్న మన దేశానికి తాజాగా సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ విషయంలో వరుసగా శుభవార్తలు అందుతున్నాయి. మన బ్రహ్మోస్ (BrahMos) క్షిపణుల ఎగుమతి కోసం వియత్నాం ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో, ఇండోనేషియాతో ఇలాంటి ఒప్పందం తుది దశలో ఉందని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సింగపూర్లో ప్రకటించారు. తాజా పరిణామాల నేపథ్యంలో 2030 నాటికి భారత రక్షణ ఎగుమతుల్ని రూ.50,000 కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
బ్రహ్మోస్ క్షిపణులకు క్యూ కడుతున్న దేశాలు (Brahmos)
షాంగ్రి-లా డైలాగ్ భద్రతా సదస్సులో మాట్లాడుతూ రాజేష్ కుమార్. వియత్నాంతో బ్రహ్మోస్ ఎగమతుల కోసం ఒప్పందం ఇప్పటికే కుదిరిందని, అయితే దీనిని ఇంకా బహిరంగంగా ప్రకటించలేదని తెలిపారు. ఇండోనేషియా, వియత్నాం రెండింటికీ సంబంధించిన ఒప్పందాలు తుది దశలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నిజానికి, వియత్నాంకు సంబంధించినది ఇప్పటికే సంతకం చేశారని, ఇండోనేషియాతో చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయన్నారు. ఒప్పందం త్వరలో ఖరారు అవుతుందని ఆయన వెల్లడించారు.

వియత్నాం బాటలోనే ఇండోనేషియా
వియత్నాంతో కుదిరిన ఒప్పందం విలువ దాదాపు ₹5,800 కోట్లుగా అంచనా. ఇందులో తీర రక్షణ క్షిపణి బ్యాటరీలు, తొలి బ్యాచ్ క్షిపణులు, శిక్షణ, లాజిస్టిక్స్ మద్దతు ఉన్నాయి. భవిష్యత్తులో వియత్నాం బ్రహ్మోస్ ఎయిర్-లాంచ్డ్ వెర్షన్ను కూడా కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన మొదటి విదేశీ దేశం ఫిలిప్పీన్స్. ఇది 2022లో దాదాపు $375 మిలియన్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఇండోనేషియాతో ఒప్పందం ఖరారైతే, ఆ దేశం తదుపరి బ్రహ్మోస్ కొనుగోలుదారు కానుంది. ఈ ఒప్పందాలు దక్షిణ చైనా సముద్రంలో నిరంతర ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలకు ఈ ప్రాంతంలో చైనాతో ప్రాదేశిక వివాదాలున్నాయి. ఈ సముద్రంలో పెద్ద భాగాన్ని చైనా తనదని వాదిస్తుండగా, అనేక ఆగ్నేయాసియా దేశాలు ఆ వాదనలను వ్యతిరేకిస్తున్నాయి.

బ్రహ్మోస్ ప్రత్యేకతలు ఇవే
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులలో బ్రహ్మోస్ ఒకటి. ఇది దాదాపు మాక్ 3 వేగంతో, అంటే ధ్వని వేగానికి సుమారు మూడు రెట్లు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. గాలి, సముద్రం లేదా భూమి నుండి ప్రయోగించగల ఈ క్షిపణి వేగం, ఖచ్చితత్వం ప్రధాన బలాలు. సముద్ర భద్రత పట్ల శ్రద్ధ వహించే దేశాలకు ఇది ఆకర్షణీయమైన ఎంపిక. శత్రు నౌకలు లేదా కీలక సైనిక స్థావరాలపై వేగంగా దాడి చేయగలదు. ఈ రక్షణ ఒప్పందాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. 2020 గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్, చైనా సంబంధాలు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని, ఉనికిని బలోపేతం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది. మలేషియా, థాయిలాండ్ కూడా బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఈ ఒప్పందాలు సాకారమైతే, దక్షిణ చైనా సముద్ర పరిసరాల్లోని పలు దేశాలు భారతదేశ క్షిపణి వ్యవస్థను వినియోగించవచ్చు.












Click it and Unblock the Notifications