ఇదీ నేటి భారత ముఖచిత్రం : వలస జీవులతో నిండిపోయిన హైవేలు..
లాక్ డౌన్ కారణంగా నిర్మానుష్యంగా మారిన ఢిల్లీ వీధుల్లోకి ఒక్కసారిగా ప్రవాహంలా పోటెత్తారు వలస కార్మికులు. పని లేక.. తిండి లేక.. ఖాళీ కడుపులతోనే మైళ్ల దూరం నడిచేందుకు కాలినడక మొదలుపెట్టారు. బీహార్,జార్ఖండ్,మధ్యప్రదేశ్,రాజస్తాన్,ఛత్తీస్ఘడ్.. ఇలా ఆయా రాష్ట్రాల్లోని తమ స్వస్థాలకు చేరుకునేందుకు వేలాది కి.మీ కాలి నడకనే ప్రయాణిస్తున్నారు. దీంతో భారత ముఖచిత్రంలో.. ఇప్పుడు హైవేలన్నీ వలస జీవులతోనే నిండిపోయాయి. ఒక్క ఢిల్లీనే కాదు.. ఆయా రాష్ట్రాల్లోని రాజధానుల నుంచి వలస జీవులంతా బిక్కుబిక్కుమంటూ తమ స్వస్థలాలకు బయలుదేరారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి దుస్థితి తలెత్తడం చరిత్రలో ఇదే మొదటిసారి.

దేశానికి కరోనాతో జీవన్మరణ సమస్య.. వాళ్లకు ఆకలితో జీవనర్మరణ సమస్య
మన్కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కరోనా వైరస్తో యుద్దం దేశానికి జీవన్మరణ సమస్య అని అభిప్రాయపడ్డారు. కానీ వలస జీవులు మాత్రం ఆకలితో యుద్దమే తమకు జీవన్మరణ సమస్య అని చెబుతున్నారు. విదేశాల నుంచి విమానాల్లో వైరస్లను మోసుకొచ్చినవారిని దేశానికి ఆహ్వానించి.. తమలాంటి బడుగు జీవులను మాత్రం స్వస్థలాలకు వెళ్లకుండా కట్టడి చేయడం ఏమి న్యాయమని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా హైవేలపై కాలినడకతో సాగుతున్నఈ వలసజీవుల్లో అత్యధికులు రోజుకు రూ.150 నుంచి రూ.300 వరకు సంపాదించుకునేవారే. భవన నిర్మాణ కార్మికులు,వీధుల్లో తినుబండారాలు అమ్ముకునేవారు,డ్రైవర్లు,ఇళ్లల్లో పనిచేసేవారు.. ఇలా ఎంతోమంది.

భద్ర జీవితం కాదు కదా..
ఢిల్లీలో లాక్ డౌన్ కారణంగా చాలామంది కూలీలు ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. ఇళ్లకే పరిమితమై బతకడానికి వారిదేమీ భద్ర జీవితం కాదు. దాంతో చాలామంది అప్పటికే రెండు,మూడు రోజుల పాటు ఆకలికి అలమటించారు. ఇక అక్కడే ఉంటే.. వైరస్ కంటే ఆకలితోనే ప్రాణాలు పోవడం ఖాయమని నిర్దారించుకున్న తర్వాతే స్వస్థలాలకు పయనమయ్యారు. పట్నంలో పని దొరుకుతుంది.. పూటకింత తిండి దొరుకుతుంది అన్న పరిస్థితి తలకిందులు కావడంతో భార్యా,బిడ్డలను వెంటేసుకుని వందల కి.మీ రహదారుల వెంట సాగిపోతున్నారు. దీంతో ఎప్పుడూ వాహనాలు మాత్రమే కనిపించే హైవేలపై ఇప్పుడు జన ప్రవాహం కనిపిస్తోంది. చేతుల్లో బకెట్లు,బట్టల బ్యాగులు,ఇతరత్రా వంట పాత్రలతో అలా వారు కాలినడకను కొనసాగిస్తున్నారు.

ఎవరిది బాధ్యత..
1947లో దేశ విభజన సందర్భంగా తలెత్తిన మత కల్లోలాలు వలసలకు దారితీసిన సంఘటనలు ఇప్పుడీ వలసలు గుర్తుకు తెస్తున్నాయి. అయితే అప్పటికంటే ఇప్పటి పరిస్థితులు పూర్తి భిన్నం. డబ్బున్నవారికీ.. భద్ర జీవితం గడుపుతున్నవారికీ.. ఏ రోజుకు ఆరోజు సంపాదించుకుని తినేవారికి మధ్య ఈ వలసలు స్పష్టమైన తేడాను కళ్లకు కడుతున్నాయి. ప్రస్తుతం చాలా రాష్ట్రాలు సరిహద్దులను మూసివేయడం.. ఎవరైనా వచ్చినా... క్వారెంటైన్లకు తరలిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో వందల కి.మీ నడుచుకుంటూ వెళ్లినా సరే.. వారు తమ స్వస్థలాలకు చేరుకుంటారా అన్నది ప్రశ్నార్థకమే. ఇన్ని వందల మంది కాలి నడకన ప్రయాణిస్తున్న క్రమంలో.. ఒకవేళ ఎవరైనా వైరస్ బారినపడితే... అది దావానంలా అందరినీ చుట్టుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అప్పుడు దీనికి బాధ్యత వహించేదెవరు అన్న ప్రశ్న తలెత్తకమానదు.
Recommended Video

తెలంగాణ తరహాలో చర్యలు తీసుకుని ఉంటే..
21 రోజుల లాక్ డౌన్ కారణంగా తలెత్తిన సమస్యలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. వైరస్ నియంత్రణకు ఇంతకుమించిన మార్గమేమీ లేదన్నారు. కానీ ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పరిశీలిస్తే... ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ వలస కార్మికులకు భరోసానిచ్చారు. ఇక్కడి ప్రజలతో పాటే కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్నారు. వారితో పాటు సమాన రేషన్ ఇవ్వడంతో పాటు.. కుటుంబంలో ఒక్కొక్కరికి రూ.500 ఇస్తామన్నారు. ఉచిత నీరు,విద్యుత్ వంటి ఇతరత్రా సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. మెడికల్ అవసరాలను కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఇలాంటి చర్యలు ఢిల్లీలో కూడా చేపట్టి ఉంటే.. రాజధాని నుంచి ఇంత భారీ వలస ఉండకపోయేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications