ఇంద్రాణి ప్లాన్: డ్రెస్, లిప్స్టిక్ వేసి.... పెర్ఫ్యూమ్ రాసి..
ముంబై: సంచనలం సృష్టించిన షీనా బొరా హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షీనా బోరాను హత్య చేసిన తర్వాత ఆమె తల్లి ఇంద్రాణి ముఖార్జియా శవానికి డ్రెస్ చేసి, లిప్స్టిక్ వేసి, తలను అందంగా దువ్వి సుగంధ పరీమళాలు రాసి అందంగా ముస్తాబు చేసిందని సమాచారం.
షీనా బొరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆ విషయం వెల్లడించారు. చెడువాసన రాకుండా, కారులో రాయగఢ్కు తీసుకుని వెళ్తుండగా ఎవరికీ అనుమానం రాకుండా ఇంద్రాణి ఆ పనిచేసినట్లు భావిస్తున్నారు. రాయగఢ్కు తీసుకుని వెళ్లిన తర్వాత తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్లతో కలిసి శవాన్ని దహనం చేసింది.
మార్గమధ్యలో పోలీసులు తనిఖీలు చేస్తున్నప్పుడు కారులో ఉన్న షీనా బొరా గురించి పోలీసులు ప్రశ్నించారని, ఆమెకు ఆరోగ్యం బాగా లేదని నిద్రపోతోందని ఇంద్రాణి చెప్పినట్లు తెలుస్తోంది. షీనాను హత్య చేసిన 2012 ఏప్రిల్ 24వ తేదీన శవాన్ని వర్లీలోని తన నివాసంలోనే శవాన్ని పెట్టింది. మర్నాడు మృతదేహాన్ని రాయగఢ్ అడవుల్లోకి తరలించారు.
అడవుల్లోకి తరలించిన తర్వాత షీనా శవాన్ని ఆదరాబాదరగా స్యూట్కేసులో పెట్టి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాన్ని లాక్ చేయలేదు. అయితే, ఈ కేసులో మీడియా మొఘల్ పీటర్ ముఖార్జియాకు ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు అంటున్నారు.
షీనా హత్యను చేసిన తర్వాత మృతదేహం ఆనవాళ్లు కూడా గుర్తించడం కష్టమని భావించిన ఇంద్రాణి ఓ ఉద్యోగికి చెప్పి కూతురి పేరిట హాట్ మెయిల్ ఖాతాను తెరిచింది. అయితే షీనా అమెరికాలో బిజీగా ఉన్నట్లు ఆ ఉద్యోగికి చెప్పి ఆ ఖాతా ఓపెన్ చేయించినట్లు సమాచారం. ఆ ఐడి నుంచి ఇంద్రాణి చాలా మందికి మెయిల్స్ పంపించింది.