‘షీనా ఖాతా నుంచి మెయిల్స్ పంపింది ఇంద్రాణియే’
ముంబై: తన కుమార్తె షీనా బోరాను హత్య చేసిన దాదాపు ఏడాది తర్వాత కూడా ఇంద్రాణి ముఖర్జీ తాను షీనా బోరా(24)కు తల్లిని కానీ, సోదరిని కానీ కాదని తన భర్త పీటర్ను నమ్మించడానికి ప్రయత్నించింది. షీనా బోరా హత్యకు సంబంధించి గత వారం అరెస్టు చేసిన పీటర్కు షీనా అకౌంట్ నుంచి పంపించిన ఒక ఇ-మెయిల్లో ఈ విషయం పేర్కొన్నట్లు ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేర్కొన్నారు.
షీనా బోరా బతికే ఉందని జనాన్ని నమ్మించడానికి ఇంద్రాణి చాలామందికి పంపించిన ఇ-మెయిల్స్లో ఇదొకటని గత గురువారం సిబిఐ దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి.
‘ఇది నీకు చాలా విపరీతంగా అనిపించవచ్చు కానీ ఇది మాత్రమే అసలు నిజం. ఇంద్రాణి నాకు తల్లి కానీ, సోదరి కానీ కాదు. కేవలం కొన్ని సంవత్సరాల క్రితం మన జీవితాల్లోకి వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి మాత్రమే'నని 2013 మార్చి 14న పీటర్కు పంపిన ఇ-మెయిల్లో ఉంది.
కాగా, ఈ విషయమై ఇంద్రాణి లాయరు గుంజన్ మంగ్లాను కాంటాక్ట్ చేయడానికి వీలు కాలేదు కానీ, ఆమె మాజీ భర్త, ఈ కేసులో మరో నిందితుడైన సంజీవ్ ఖన్నా లాయరు శ్రేయంశు మిథారే మాత్రం తాను ఇంకా ఛార్జిషీట్ చూడలేదని చెప్పారు.
‘నేను ఇంకా ఛార్జిషీట్ను పరిశీలించలేదు. అందువల్ల దీనిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేను' అని ఆయన పిటిఐతో అన్నారు. తాను ఆ మెయిల్ను చూడలేదని, అందువల్ల ఎలాంటి వ్యాఖ్య చేయనని పీటర్ తరఫు లాయరు నిరంజన్ ముండెర్గి కూడా చెప్పారు. తన తాత, అమ్మమ్మలకు ఒక కూతురు ఉందని ఆమె పేరు కూడా ఇంద్రాణేనని షీనా అకౌంట్నుంచి ఇంద్రాణి పంపించిన ఆ ఇ-మెయిల్లో ఉంది.
తన తల్లి ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆ వ్యక్తితో తన తల్లి లేచిపోయిందని అతని ద్వారా షీనా బోరా, మిఖైల్ అనే ఇద్దరు పిల్లలు కలిగారని ఆ ఇ-మెయిల్లో ఉంది.
తమ సొంత కాళ్లపై నిలబడడానికి దాదాపు రెండేళ్లపాటు నానాకష్టాలు పడ్డ తర్వాత అలా గడపడం సాధ్యం కాదని గ్రహించిన వాళ్లు తిరిగి ఇంటికి వచ్చారని, అప్పుడు తన తల్లి మిఖైల్ను కడుపుతో ఉందని కూడా ఆ ఇ-మెయిల్లో ఉంది.
షీనా తండ్రి తక్కువ కులానికి చెందినవాడే కాక, ఆర్థికంగా కూడా అంత ఉన్న కుటుంబానికి చెందినవాడు కాదని, అందువల్లనే తన తాత, అమ్మమ్మలకు వారి సంబంధం ఇష్టం లేదని కూడా ఆ ఇ-మెయిల్లో ఉంది.
కాగా, 2012 ఏప్రిల్ 23న ఇంద్రాణి లండన్ నుంచి ముంబై తిరిగి వచ్చింది. 24న మాజీ భర్త సంజయ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్తో కలిసి షీనాను కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేసిన విషయం తెలిసిందే.