రాణీ ముఖర్జీ గుట్టురట్టు: ఇన్ఫార్మర్కు రూ.5కోట్లు
ముంబై: బాలీవుడ్ నటులు నటి రాణిముఖర్జీ, శేఖర్ సుమన్, బాలాజీ టెలీఫిలిమ్స్, అధికారి బ్రదర్స్తో పాటు16 ఇతర బడా సంస్థల ఆదాయం బండారాన్ని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అందించిన ఐటీ ఇన్ఫార్మర్కు రూ.5కోట్ల రూపాయల రివార్డు మొత్తాన్ని ఆరు నెలలలోగా చెల్లించాలని ముంబై హైకోర్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఆదేశించింది.
ఆదాయపుపన్ను శాఖ నిబంధనల ప్రకారం.. రహస్య ఆస్తులు, ఆదాయం గురించి సమాచారం అందించిన ఇన్ఫార్మర్కు వసూలు చేసిన ఆదాయపు పన్నులో 7.5 శాతం నుంచి 10 శాతం మొత్తాన్ని రివార్డుగా అందించాలి. ముంబైలో ఓ ఐటీ ఇన్ఫార్మర్ 1990 నుంచి 2000 సంవత్సరాల వరకు అందించిన సమాచారం మేర ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేసి రూ.50 కోట్ల రూపాయలకు పైగా పన్నును వసూలు చేశారు.
కానీ, ఇన్ఫార్మర్కు ఇవ్వాల్సిన రివార్డును అధికారులు విస్మరించారు. తనకు యాభై ఏళ్ల వయసు వచ్చిందని, తనకు ఇదే జీవనాధారమని, తాను ప్రాణాలకు తెగించి అక్రమ ఆస్తులు, ఆదాయం సమాచారాన్ని పరిశోధించి,విస్తారంగా పర్యటించి అధికారులకు అందజేశానని... తనకు రావాల్సిన రివార్డు వెంటనే ఇవ్వాలని సదరు ఇన్ఫార్మర్ కోర్టులో న్యాయవాదులు బ్రిజేష్ పాఠక్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.
ఐటీ నిబంధనల ప్రకారం ఇన్ఫార్మర్ సమాచారాన్ని బహిర్గతం చేయరాదని న్యాయవాది వాదించారు. తనకు రావాల్సిన రివార్డు కోసం 2009లో తాను ఐటీ శాఖ కార్యాలయం ముందు కూడా దీక్ష చేశానని, అప్పట్లో ఆదాయపు పన్ను శాఖ డైరెక్టరు జనరల్ మూడు నెలల్లోగా రివార్డు ఇస్తామని చెప్పి తీవ్ర జాప్యం చేశారని ఇన్ఫార్మర్ ఆరోపించారు.
కాగా, అధికారుల రెడ్ టేపిజం వల్ల రివార్డు మొత్తాన్ని చెల్లించడంలో తీవ్ర జాప్యం జరిగిందని వాపోయాడు. ఇప్పటికైనా తనకు రివార్డు అందజేయాలని కోర్టును అభ్యర్థించాడు. దీనిపై విచారించిన ముంబై కోర్టు.. ఆదాయపుపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్ఫార్మర్కు త్వరలో రూ.5కోట్లను ఆదాయపు పన్ను శాఖ రివార్డుగా అందజేయనుంది.