టెక్కీ స్వాతి హత్య కేసు: ఎవరీ రామ్ కుమార్, ఎలా పట్టుకున్నారు?
చెన్నై: ఇన్పోసిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్ కుమార్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా గత నెల 24వ తేదీన దుండగుడు చంపిన విషయం తెలిసిందే. హత్య జరిగిన వారం రోజుల తర్వాత పోలీసులు నిందితుడిని పట్టుకోలిగారు.
స్వాతిని అతను ఎందుకు హత్య చేశాడనే విషయం మాత్రం ఇంకా తేలలేదు. పోలీసులు రావడం గమనించి రామ్ కుమార్ తమ ఇంటి పెరట్లో దాక్కున్నాడు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అతను గొంతు కోసుకున్నాడు. అయితే, పోలీసులు ప్రాణాలు పోకుండా అతన్ని పట్టుకోగలిగారు.
వైద్యులు అతని కంఠానికి శస్త్ర చికిత్స చేశారు. మరో 24 గంటల వరకు అతన్ని మాట్లాడించవద్దని వైద్యులు పోలీసులకు సూచించారు. దాంతో హత్యకు గల కారణం తెలుసుకోవడంలో జాప్యం జరిగే అవకాశం ఉంది. నిందితుడు తమిళనాడులోని తిరునల్వేలీ జిల్లా తెంకాసిలో గల మీనాక్షిపురం గ్రామానికి చెందినవాడని తెలుస్తోంది.
ఒక్కడే కావచ్చు...
స్వాతి హత్య వెనక పి. రామ్ కుమార్ ఒక్కడే ఉన్నట్లు భావిస్తున్నామని పోలీసు కమిషనర్ చెన్నై టికె రాజేంద్రన్ చెప్పారు. హత్యకు గల కారణం తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు.
22 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్
రామ్ కుమార్ 22 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. తురునల్వేలీలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అతను డిగ్రీ పూర్తి చేశాడు.
చూలైమేడులో నివాసం...
ఉద్యోగం కోసం చెన్నై వచ్చిన రామ్ కుార్ కొన్ని నెలలుగా చూలైమేడులోని ఓ భవనంలో ఉంటున్నాడు. ఆ ప్రాంతంలోనే స్వాతి ఉంటుండేది.
యజమాని గుర్తించాడు...
పోలీసులు విడుదల చేసిన స్కెచ్ను చూసి రామ్ కుమార్ను ఇంటి యజమాని గుర్తించినట్లు న్యూస్ మినట్ రాసింది. హత్య తర్వాత రామ్ కుమార్, స్వాతి ఫోన్లు పనిచేయలేదని తెలుస్తోంది.
వారం రోజుల పాటు మిస్సింగ్..
హత్య జరిగిన తర్వాత వారం రోజుల పాటు రామ్ కుమార్ కనిపించకపోవడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు.
గదిలో సోదాలు...
రామ్ కుమార్ నివసిస్తున్న గదిలో చెన్నై పోలీసులు సోదాలు నిర్వహించి కొన్ని సాక్ష్యాలును సేకరించారు. ఆ తర్వాత తిరునల్వేలీ పోలీసులను అప్రమత్తం చేశారు.
ఇంటిని చుట్టుముట్టారు...
రామ్ కుమార్ ఇంటిని తిరునల్వేలీ ఎస్పీ విక్రమన్ నేతృత్వంలోని పోలీసు బృందం చుట్టుముట్టింది. ఆ సమయంలో రామ్ కుమార్ గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.