సింధురత్నలో పొగలు, అధికారులు మృతి: జోషి రిజైన్
ముంబై: భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు గల్లంతయ్యారు. ముంబయి తీరానికి దగ్గర్లో రష్యా నిర్మించిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్నలో బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పొగలు చెలరేగడంతో ఏడుగురు సెయిలర్లు అస్వస్థతకు గురయ్యాయి. ఇద్దరి జాడ తెలియడం లేదు.
అస్వస్థతకు గురయిన ఏడుగురు సెయిలర్లు పొగ పీల్చడంతో ఉక్కిరిబిక్కిరి కావడంతో వారిని హెలికాప్టర్లో నేవీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం దీనిపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని నౌకాదళాన్ని ఆదేశించింది.
నౌకాదళంలో వరసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ నౌకాదళ ప్రధానాదికారి డికె జోషీ తన పదవికి రాజీనామా చేశారు. ఐఎన్ఎస్ సింధురత్నలో ప్రమాదం చోటు చేసుకున్న కొద్ది గంటల్లోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడు నెలల కాలంలో నావికాదళానికి చెందిన యుద్ధ నౌకల్లో 10 దుర్గటనలు జరగ్గా, జలాంతర్గాముల్లో ప్రమాదం జరగడం మూడోసారి.
గత ఆగస్టులో ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామి ముంబయి హార్బర్కు దగ్గర్లో మునిగిపోయి దానిలో ఉన్న మొత్తం 18 మంది చనిపోయారు. నౌకాదళానికి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధురత్న రొటీన్ ట్రైనింగ్, తనిఖీల కోసం ముంబయి తీరానికి దగ్గర్లో సముద్రంలో ఉందని, సముద్రంలో ఉండగా బుధవారం తెల్లవారుజామున జలాంతర్గామిలోని సెయిలర్లు ఉండే మూడో కంపార్ట్మెంట్లో పొగలు వచ్చాయని నేవీ ఒక పత్రికా ప్రకటనలో తెలియజేసింది.
కాగా, జోషీకి ఇంకా పదిహేను నెలల పదవి కాలం ఉంది. జోషీ రాజీనామాతో రక్షణమంత్రి... వైస్ చీఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్కే ధోవన్కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సింధురత్న ప్రమాదంలో గల్లంతైన అధికారులు మృతి చెందినట్లుగా గుర్తించారు.