ప్రమాదం ‘రాష్ డ్రైవింగ్’తో జరిగితే బీమా వర్తించదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: రాష్(నిర్లక్ష్యపు) డ్రైవింగ్పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. వాహనాన్ని వేగంగా, నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి గురైతే.. అలాంటి ప్రమాదానికి బీమా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైనవారు బీమా క్లెయిమ్ చేసుకోవద్దని తేల్చి చెప్పింది.
జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అయితే, ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి 'పర్సనల్ యాక్సిడెంట్' పాలసీ కింద పరిహారం అందుతుందని కోర్టు పేర్కొంది.జాతీయ బీమా కంపెనీ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.
దిలీప్ భౌమిక్ అనే వ్యక్తి 2012 మే 20న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆయన స్వయం తప్పిదం వల్లే ప్రమాదానికి గురయ్యారని బీమా కంపెనీ వాదించింది. అయినా, త్రిపుర హైకోర్టు మృతుడి కుటుంబసభ్యులకు రూ.10.57లక్షల బీమా చెల్లించాలని సదరు కంపెనీని ఆదేశించింది. దీంతో బీమా కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. త్రిపుర హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. మృతుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు గుర్తించి.. స్వయం తప్పిదంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదానికి గురైతే బీమా ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కింద భౌమిక్ కుటుంబానికి రూ.2లక్షలు బీమా ఇవ్వాలని కోర్టు జాతీయ బీమా కంపెనీని ఆదేశించింది.