పార్లమెంట్ సమావేశాల వేళ ఒక్కటిగా అధికార, విపక్షాల నిర్ణయం.. అనూహ్యం!
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. పార్లమెంటు సమావేశాల ముందు ఊహించని అనూహ్య పరిణామం ఒకటి చోటుచేసుకుంది. అధికార విపక్ష పార్టీలు ఒక్కటిగా ఒక అంశం పైన కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశ రాజకీయాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
జస్టిస్ వర్మ తొలగింపుకు మహాభియోగ తీర్మానం
ముఖ్యంగా జస్టిస్ వర్మ తొలగింపుకు మహాభియోగ తీర్మానం తీసుకురానున్నట్టు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిబు వెల్లడించారు. ఇప్పటికే ఈ నిర్ణయానికి అనుకూలంగా వంద మందికిపైగా ఎంపీలు సంతకాలు పెట్టారని తమ మద్దతును తెలియజేశారని తెలుస్తుంది. మార్చి 14వ తేదీన హోలీ రోజున ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆయన ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది.

జస్టిస్ వర్మ వ్యవహారంలో జరిగిందిదే
ఆ తర్వాత జస్టిస్ వర్మ పైన న్యాయవ్యవస్థ అవినీతిలో కూరుకుపోయినట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో సుప్రీంకోర్టు తానే స్వయంగా విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యుల కమిటీ ఆయన పైన మహాభియోగానికి సిఫార్సు చేయడం, అయితే దానిని ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, పిటిషన్ దాఖలు చేయడం జరిగాయి.
మహాభియోగ తీర్మానాన్ని మెజార్టీ సభ్యులతో ఆమోదం పొందాలి
భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలి అంటే అది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే సాధ్యమవుతుంది. అది కూడా మహాభియోగ తీర్మానం ఆధారంగా జరగవలసి ఉంటుంది.ఇక ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలో కనీసం వంద మంది సభ్యులు, రాజ్య సభలో కనీసం 50 మంది సభ్యుల మద్దతు ఉండాలి. వీరి మద్దతుతో మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టి, మెజారిటీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందాలి.
అధికార పక్షంతో పాటు తీర్మానంపై సంతకం చేసిన ప్రతిపక్షం
అలా ఆమోదం పొందితేనే మహాభియోగ తీర్మానానికి చట్టబద్ధత లభిస్తుంది. అయితే పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో జస్టిస్ వర్మ అవినీతి వ్యవహారంలో అధికార పక్షానికి మద్దతుగా, ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వబోతున్నట్లు సమాచారం. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సహా 35 మంది కాంగ్రెస్ ఎంపీలు ఈ తీర్మానం పైన సంతకం చేసినట్టు తెలుస్తోంది.
అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక్కటిగా నిర్ణయం తీసుకోవడం అనూహ్యం
ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిబు ఇది పార్టీలకు అతీతమైన అంశమని న్యాయవ్యవస్థలో అవినీతిపై ప్రతి పార్టీకి బాధ్యత ఉంటుందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ అనూహ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక్కటిగా నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీసింది.












Click it and Unblock the Notifications