పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్: మెహుల్ చోక్సీపై రెడ్కార్నర్ నోటీసులు జారీ చేసిన ఇంటర్పోల్
న్యూఢిల్లీ: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ బ్యాంకులకు రుణాలు ఎగవేసి దేశం విడిచి వెళ్లడంతో ఆయనకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు ఇదివరకే జారీ చేసింది విచారణ సంస్థ. తాజాగా ఆ నోటీసులను మెహుల్ చోక్సీ పై జారీ చేసింది. మెహుల్ చోక్సీ ఈ ఏడాది మొదట్లో అంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడు. సీబీఐ కోరిక మేరకు ఇంటర్పోల్ మెహుల్ చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీచేసింది. ఈ కేసును సీబీఐ విచారణ చేస్తోంది.
రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారంటే ఇంటర్పోల్లోని 192 సభ్యదేశాల సరిహద్దుల్లో చోక్సి ఎక్కడ కనిపించిన ఆ దేశ పోలీసులు అరెస్టు చేసే అధికారం ఉంది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం ద్వారా చోక్సీని, నీరవ్ మోడీలను భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసులను ఈ ఏడాది జూలైలో జారీ చేసింది. నీరవ్ మోడీ, చోక్సీలకు సంబంధించి కేసును ఈడీ, సీబీఐలు విచారణ చేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నీరవ్ మోడీ, చోక్సీలపై మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తోంది. సీబీఐ నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపడుతోంది. మరోవైపు నీరవ్, చోక్సీలపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది.
ఇదిలా ఉంటే నీరవ్ మోడీ సోదరుడు నీషల్, సోదరి పూర్వీలపై కూడా ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అయితే వీరిద్దరూ బెల్జియం పౌరసత్వం కలిగి ఉన్నారు. వీరితో పాటు నీరవ్ ఆప్త మిత్రులు మిహిర్ భన్సాలీ, ఆదిత్య నానవతిలపై కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.