తీహార్ జైలుకు చిదంబరం: నంబర్ 7 కారాగారం ఖరారు!
న్యూఢిల్లీ: అనూహ్యం. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తీహార్ జైలు పాలయ్యారు. ఆయనను తీహార్ జైలుకు పంపిస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని సూచించింది. రెండురోజుల పాటు సీబీఐ కస్టడీ గురువారం నాటికి ముగిసింది. దీనితో అధికారులు ఆయనను ఈ మధ్యాహ్నం ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మరో రెండు వారాల పాటు కస్టడీని పొడిగించాలని సీబీఐ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనికి హైకోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ కుగ్డా అంగీకరించారు. చిదంబరాన్ని ఈ నెల 19వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీలో తీసుకోవాలని సూచించారు. విచారణ సందర్భంగా ఆయనను తీహార్ జైలులో ఉంచాలని ఆదేశించారు.

ఏడో నంబర్..
తీహార్ కారాగార కాంప్లెక్స్ లోని ఏడో నంబర్ జైలు ఆవరణలో చిదంబరాన్ని ఉంచే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఏడో నంబర్ జైలు ఆవరణను ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని ఉంచుతారు. అక్కడే చిదంబరాన్ని విచారించవచ్చని చెబుతున్నారు. కాగా ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో ఢిల్లీ న్యాయస్థానం చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ రోజ్ అవెన్యూ న్యాయస్థానం.. ఏకంగా తీహార్ జైలుకుక పంపించడం సంచలనానికి దారి తీసింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణ కోసం జైలుకు పంపించాల్సిన అవసరం లేదంటూ చిదంబరం తరఫున వాదిస్తోన్న కేంద్ర మాజీమంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు న్యాయస్థానం.

సాధారణ ఖైదీగానే..
చిదంబరాన్ని సాధారణ ఖైదీగానే పరిగణిస్తామని తీహార్ జైలు సూపరింటెండెంట్ తెలిపారు. కేంద్ర మాజీమంత్రి అయినప్పటికీ..ప్రత్యేక సదుపాయాలను కల్పించే అవకాశాలు ఎంత మాత్రమూ లేవని ఆయన స్పష్టం చేశారు. చిదంబరం వయస్సు 73 సంవత్సరాలు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథం కింద.. సాధారణ వసతులు కల్పిస్తామని అన్నారు. దీనితోపాటు ఆయనకు జెడ్ కేటగిరీలో ఉన్న నాయకుడు కావడం వల్ల భద్రతా పరమైన చర్యలు కట్టుదిట్టంగా చేపడతామని తీహార్ జైలు సూపరింటెండెంట్ పేర్కొన్నారు. తనకు వెస్టర్న్ టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా చిదంబరం కోరినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై జైలు సూపరింటెండెంట్ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఆయనకు కల్పించాల్సిన అదనపు సౌకర్యాలపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనేది కోర్టు నుంచి వచ్చిన ఆదేశాలను చూసిన తరువాతే స్పందిస్తానని అన్నారు.

అలా ముందస్తు బెయిల్.. ఇలా తీహార్ జైల్
అంతకుముందు- ఎయిర్ సెల్-మ్యాక్సిస్ కేసులో ఢిల్లీ న్యాయస్థానం చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరానికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే సీబీఐ అధికారులను చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు విషయంలో వారు ఆయనను రోజ్ అవెన్యూ న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టారు. కస్టడీని పొడిగించాలని సీబీఐ అధికారులు కోరారు. దీనికి న్యాయమూర్తి అంగీకరించారు. 14 రోజుల పాటు కస్టడీలోకి అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. విచారణ సందర్భంగా ఆయనను తీహార్ జైలులో ఉంచాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కూడా న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్ జారీ చేశారు.












Click it and Unblock the Notifications