డ్రగ్స్ కేసులో బెయిల్: తొలిసారిగా బాహ్య ప్రపంచం ముందుకు షారుఖ్ కొడుకు: చెల్లితో కలిసి
బెంగళూరు: బెంగళూరు వేదికగా రసవత్తరంగా సాగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ 15వ ఎడిషన్ మెగా వేలంపాట ముగింపుదశకు వచ్చింది. అన్ క్యాప్డ్ ప్లేయర్ల వేలం పాట సాగుతోంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభమైన ఈ మెగా ఈవెంట్లో పలువురు టాప్ క్లాస్ క్రికెటర్లు ఐపీఎల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. సత్తా ఉన్న క్రికెటర్ల కోసం కోట్ల రూపాయలను ధారబోశాయి ఫ్రాంఛైజీలు. వారిపై కనకవర్షాన్ని కురిపించాయి.
ఆదివారం కూడా..
దీనికి నిదర్శనం ఇషాన్ కిషన్. అతని కోసం ముంబై ఇండియన్స్ 15 కోట్ల 25 లక్షలను వ్యయం చేసింది. ఈ వేలంపాట ఆదివారం కూడా కొనసాగుతుంది. ఇవ్వాళ్టి తరహాలోనే మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులోని ఐటీసీ గార్డెనియా హోటల్ వేదికగా ప్రారంభమౌతుంది. సాయంత్రానికి బిడ్డింగ్ ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. ఇక ఆయా ఫ్రాంఛైజీలన్నీ ఐపీఎల్ సీజన్ 2022 కోసం సమాయాత్తమౌతాయి. మార్చిలో ఈ టోర్నమెంట్ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బాలీవుడ్ స్టార్స్ డుమ్మా..
కాగా- బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, నటి జుహీచావ్లా జాయింట్గా కోల్కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ దఫా వేలంపాటకు వారిద్దరూ డుమ్మా కొట్టారు. పంజాబ్ కింగ్స్ ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతిజింతా కూడా గైర్హాజర్ అయ్యారు. గత ఏడాది నవంబర్లో కవలలకు జన్మనిచ్చింది ప్రీతిజింతా. భర్త, చిన్నారులతో కలిసి ఆమె ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోంది. నెలల పిల్లలను వదిలేసి బెంగళూరుకు రాలేకపోతున్నానని ఆమె వివరణ ఇచ్చారు.
ఆర్యన్ ఖాన్..సుహానా ఖాన్
కోల్కత నైట్ రైడర్స్ ఓనర్లు షారుఖ్ ఖాన్, జూహీచావ్లా మెగా ఆక్షన్కు హాజరు కాలేదు. వారి స్థానంలో వారి పిల్లలు అటెండ్ అయ్యారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్.. వేలంలో పాల్గొన్నారు. జూహీచావ్లా కుమార్తె జాహ్నవి మెహతాతో కలిసి వారు వేలంపాటలో కనిపించారు. గత సంవత్సరం ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. చాలాకాలం పాటు అతను జైలు జీవితాన్ని గడిపాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు ఆర్యన్ ఖాన్.
Recommended Video
డ్రగ్స్ కేసు బెయిల్ తరువాత..
బెయిల్ లభించిన తరువాత బాహ్య ప్రపంచం కంట్లో పడలేదు. దాదాపు అజ్ఞాత జీవితాన్నే గడిపాడతను. సుదీర్ఘ విరామం తరువాత తొలిసారిగా బయటికి వచ్చాడు. రావడం రావడంతోనే ఓ మెగా ఈవెంట్కు రెప్రజెంట్ చేశాడు. సొంత ఫ్రాంఛైజీ కోల్కత నైట్ రైడర్స్ తరఫున వేలంపాటలో పాల్గొన్నారు. ప్లేయర్లను సెలెక్ట్ చేసుకున్నాడు. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం, కొద్దిరోజుల పాటు జైలు జీవితాన్ని గడపటం వంటి ఛాయలేవీ కనిపించలేదు. ఉల్లాసంగా కనిపించాడతను.