IPL 2023 : తొలి మ్యాచ్ లోనే అమల్లోకొచ్చిన కొత్త రూల్స్-ఇంపాక్ట్ ప్లేయర్లు, డీఆర్ఎస్, ఇంకెన్నో..
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్ లో పలు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఈ నిబంధనల్ని అమలు చేశారు. వీటి ద్వారా ఇరుజట్లకూ ఏ మేరకు ప్రయోజనం కలిగిందన్న విషయం పక్కనబెడితే అభిమానులకు మాత్రం ఇవన్నీ కొత్తగా కనిపించాయి. దీంతో పాటు ఇరుజట్లూ వీటిని వినియోగించుకునే విషయంలో తడబడ్డాయి.
నిన్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఐపీఎల్ ఓపెనర్ మ్యాచ్ లో తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్స్ నిబంధన అమలు చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అంబటి రాయుడు స్ధానంలో తుషార్ దేశ్ పాండే ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చి బౌలింగ్ వేశాడు. ఓ వికెట్ కూడా తీశాడు. అలాగే ఐపీఎల్ చరిత్రోలోనే తొలి ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా నిలిచాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున గాయపడ్డ కేన్ విలియమ్సన్ స్ధానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా తమిళనాడు బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు. గుజరాత్ రన్ ఛేజ్ లో క్రీజులో ఉన్న కాసేపు సుదర్శన్ మెరుపులు మెరిపించాడు.

మరోవైపు చెన్నై సూపర్ ఇన్నింగ్స్ లో ఎలాంటి డీఆర్ఎస్ రివ్యూలు తీసుకోలేదు. కానీ గుజరాత్ టైటాన్స్ మాత్రం రెండు రివ్యూలు తీసుకుంది. గుజరాత్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ చెన్నై బౌలర్ హంగార్ గేకర్ ఓవర్ లో రెండో బౌన్సర్ వేశాడోమో తెలుసుకునేందుకు డీఆర్ఎస్ రివ్యూ కోరాడు. అలాగే వైడ్ బాల్ ను తెలుసుకునేందుకు మరో గుజరాత్ బ్యాట్స్ మెన్ విజయ్ శంకర్ కూడా డీఆర్ఎస్ రివ్యూ తీసుకున్నాడు. అయితే ఈ రెండు రివ్యూలు కూడా విఫలమయ్యాయి.
అలాగే టాస్ తర్వాతే ఇరుజట్ల కెప్టెన్లు తొలిసారిగా తమ ప్లేయింగ్ ఎలెవన్స్ ను ప్రకటించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది కూడా తొలిసారే. అలాగే ఈ మ్యాచ్ తో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రభావం అంతగా కనిపించలేదు. కానీ టోర్నీ ముందుకు సాగే కొద్దీ వీటి ప్రభావం కనిపించవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా కీలక మ్యాచ్ ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన జట్టు విజయవకాశాలపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications