సంచలనం:పలువురు ఐపిఎస్ అధికారులపై చర్యలకు కేంద్రం సమాయత్తం...కారణం ఏంటంటే?
అమరావతి:దేశవ్యాప్తంగా 500 మందికి పైగా ఐపిఎస్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. కారణం వీళ్లంతా ఆస్తుల ప్రకటనకు సంబంధించిన నిబంధనను పాటించకపోవడమే!...ఇలా ఐపిఎస్ అధికారులు ఆస్తులను ప్రకటిచలేదన్న విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కొందరు బ్యూరోక్రాట్లు అవినీతి సామ్రాట్టులుగా మారుతున్నారనే విషయాన్ని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఐపిఎస్ అధికారులు తమ ఆస్తులను ఎందుకు వెల్లడించడం లేదు?...నిజంగానే అక్రమాస్తుల ఆర్జనే వారు తమ ఆస్తులు ప్రకటించలేకపోవడానికి కారణమా? ...మరి ప్రభుత్వం ఎలా స్పందించనుంది?...ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా...సీనియర్ ఐపిఎస్ లు
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేస్తున్న 515 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఒకే కారణంగా ప్రమోషన్ కు బ్రేక్ పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం ప్రతి ఏడాది జనవరి ముప్పైఒకటి తేదీ వరకు అఖిల భారత సర్వీసుల అధికారులు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వానికి తెలియచేయవలసి ఉంటుంది. అయితే 2016 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు మొత్తం 3905 ఐపిఎస్ అధికారులకు గాను, 3390 ఐపిఎస్ అధికారులు మాత్రమే తమ ఆస్తుల వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. అయితే ఆస్తుల వివరాలు వెల్లడించని 515 మందిలో డిజిపి స్థాయి అధికారులతో సహా పలువురు సీనియర్ ఐపిఎస్ అదికారులు, రిటైరైన ఐపిఎస్ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను మొదటగా వీరికి ప్రమోషన్లు నిలిపి వేస్తారని, తదనంతరం చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇలా వెల్లడించాలి...కానీ
రూల్స్ ప్రకారం వీరు తమ పేరిట,తమ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిర,చరాస్తుల వివరాలను తప్పకుండా ప్రభుత్వానికి వెల్లడించాలి. అంతేకాదు తమకు సంబంధించిన నగదు,నగల మొత్తం వివరాలు, బ్యాంకులో ఉన్న నిల్వలు, ఇన్వెస్ట్ మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, ఇన్సూరెన్స్ పాలసీలు, పి.ఎఫ్ వివరాలు, లోన్స్, అప్పులు, మోటారు వాహనాలు వంటి వివరాలన్నీప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. అయితే ఇలా 515 మంది ఈ వివరాలు తెలుపకపోవడంతో వీళ్ల పదోన్నతులు నిలిపివేయాలని, విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వకూడదని హోంశాఖ నిర్ణయించిందని విశ్వసనీయ సమాచారం. అంతేకాదు వీరిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోందని తెలుస్తోంది.
ఈ విషయం...ఎలా తెలిసిందంటే?...
ఇలా ఆస్తుల వివరాలు వెల్లడించని ఐపిఎస్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాయడం వల్ల ఈ విషయం బైటకు తెలిసింది. ఈ విషయమై తెలుగు రాష్ట్రాల డీజీపీ కార్యాలయాలను మీడియా వివరాలు అడుగగా కేంద్రం నుంచి లేఖలు వచ్చిన విషయం వాస్తవమేనని అంగీకరించినట్లు తెలిసింది. ఆంధ్రాకు సంబంధించి 12 మంది, తెలంగాణాకు సంబంధించి 8 మంది ఈ జాబితాలో ఉన్నారని, అందులో తెలంగాణాకు చెందిన రిటైర్డ్ ఆఫీసర్ ఏకే ఖాన్ (తెలంగాణ ఏసీబీ మాజీ చీఫ్), ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు పేర్లు కూడా ఉండడం గమనార్హం.
జాబితాలో...తెలుగు రాష్ట్రాల అధికారులు వీరే...
ఈ జాబితాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐపిఎస్ అధికారులు: ఇటీవలే డీజీపీగా పదవీ విరమణ చేసిన నండూరి సాంబశివరావు తో పాటు అడిషినల్ డిజి అంజనా సిన్హా, పీవీ సునీల్ కుమార్, ఐజీలు ఎ. రవిశంకర్, ఎన్. బాలసుబ్రమణ్యం, ఎ. సుందర్కుమార్ దాస్, కె. వెంకటేశ్వరరావు, డీఐజీలు కేవీవీ గోపాల్రావు, ఏఎస్ ఖాన్, యువ ఐపీఎస్ లు శశికుమార్, బీఆర్ వరుణ్, సుమిత్ కాగా తెలంగాణా నుంచి ఏసీబీ మాజీ చీఫ్ ఏకే ఖాన్తో పాటు ఐజీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, డీఐజీలు జి.సుధీర్ బాబు, పి. ప్రమోద్ కుమార్, షానవాజ్ ఖాసీమ్, ఎస్పీ ర్యాంకు అధికారులు పి. విశ్వప్రసాద్, ఆర్. రెమారాజేశ్వరి, మైలబత్తుల చేతన.అయితే ఏ కారణం చేత తాము ఆస్తుల వెల్లడి చేయలేకపోయామో షోకాజ్ నోటీసుకు జవాబు ఇచ్చి...తదనంతరం ఆయా వివరాలు వెల్లడించిన ఐపిఎస్ అధికారులు వేటు నుంచి తప్పుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.